Telangana: భారత సైన్యం కోసం డ్రోన్ల తయారీ ల్యాబ్.. బిట్స్ హైదరాబాద్ విద్యార్థుల ప్రతిభ.. నెలకు 100 తయారు చేసే సామర్థ్యం
ఈ వార్తాకథనం ఏంటి
అత్యాధునిక సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డ్రోన్లను సైనికులే స్వయంగా తయారు చేసుకునేలా బిట్స్ హైదరాబాద్కు చెందిన ఇద్దరు విద్యార్థులు సైన్యానికి ప్రత్యేకంగా మొబైల్ డ్రోన్ ల్యాబ్ను అందించారు. ఈ ల్యాబ్ ద్వారా నెలకు సుమారు వంద డ్రోన్లను తయారు చేసే సామర్థ్యం ఉంది. ఇటీవలే ఈ ఇద్దరు విద్యార్థులు జమ్మూ-కశ్మీర్కు వెళ్లి అక్కడ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. బిట్స్ హైదరాబాద్లో చదువుతున్న జయంత్ ఖత్రి,శౌర్య చౌదరి అనే విద్యార్థులు కలిసి రెండేళ్ల క్రితం'అపొలియాన్'అనే స్టార్టప్ను ప్రారంభించారు. మెకానికల్,ఎలక్ట్రికల్ విభాగాల్లో విద్యనభ్యసిస్తున్న వీరు,గత ఏడాది కాలంగా పూర్తిగా డ్రోన్ల రూపకల్పన, తయారీపై దృష్టి సారించారు. వీరు తయారు చేస్తున్న డ్రోన్లలో 70 శాతం స్వదేశీ పరికరాలు, మిగతా 30శాతం విదేశీ భాగాలు ఉపయోగిస్తున్నారు.
వివరాలు
ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తితో…
ఆరు నెలల క్రితం వీరి డ్రోన్లను వినియోగించిన సైన్యాధికారులు, భద్రతా కారణాల దృష్ట్యా డ్రోన్లను తామే సొంతంగా తయారు చేసుకునేలా అవసరమైన పరిజ్ఞానాన్ని అందించాలని కోరారు. ఈ ప్రతిపాదనకు స్పందిస్తూ, ఈ ఇద్దరు విద్యార్థులు అంగీకరించారు. ''ఆపరేషన్ సిందూర్ సమయంలో మన సైన్యం పాకిస్థాన్కు చెందిన డ్రోన్లను ధ్వంసం చేసిన తీరు మాకు ఎంతో ప్రేరణనిచ్చింది.శత్రుదేశాల డ్రోన్ల సాంకేతికతను అధ్యయనం చేసి,వాటికంటే శక్తివంతమైన డ్రోన్లను తయారు చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్లాం.అనేక రోజులపాటు పరిశోధనలు చేసి,గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డ్రోన్లను రూపొందించాం.మా డ్రోన్లు శత్రుదేశాల రాడార్లకు చిక్కకుండా పని చేస్తాయి. అంతేకాదు, ఇరుకైన ప్రదేశాల్లోనూ సులభంగా కదలగలగడం, లక్ష్యాలను ఛేదిస్తూ బాంబులు వదలడం వీటి ప్రత్యేకత'' అని జయంత్ వివరించారు.