
BJP: తెలంగాణ-ఆంధ్రలో ఒకేసారి బీజేపీ అధ్యక్షులు ఎంపిక.. ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ సంస్థాగత ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులను ఒకేరోజు ప్రకటించేందుకు కేంద్ర అధిష్ఠానం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణకు సంబంధించి ఆదివారం అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం సోమవారం నామినేషన్లను స్వీకరించనున్నారు. జూలై 1వ తేదీన రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లోనూ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది.
Details
ఒకేసారి ఎన్నికలు పూర్తి
రాష్ట్ర ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ను వెల్లడించారు. జూన్ 30న నామినేషన్లు స్వీకరించనున్నారు. అదే రోజు సాయంత్రం వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. జూలై 1న అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తికానుంది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో భాజపా అధ్యక్షుల ఎన్నికలు ఒకేసారి పూర్తవ్వనున్నాయి. పార్టీ సంస్కృతిలో భాగంగా, సంస్థాగతంగా ఈ ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.