
Air India: ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. టిష్యూ పేపర్పై బెదిరింపు సందేశం
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం పెద్ద కలకలం ఏర్పడింది. ఎయిర్ ఇండియా విమానంలో బాంబు పెట్టారని వచ్చిన బెదిరింపు సమాచారం అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు ప్రారంభించగా,ఆ బెదిరింపు సందేశం నిరాధారమైందిగా తేలింది. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే...ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 వద్ద ఉన్న ఎయిర్ ఇండియా విమానంలోని క్యాబిన్లో సిబ్బందికి ఓ టిష్యూ పేపర్ కనిపించింది. అందులో"ఎయిర్ ఇండియా 2948 @ T3లో బాంబు ఉంది"అనే వాక్యం రాసి ఉండటాన్ని గుర్తించిన వెంటనే సిబ్బంది పై అధికారులను సమాచారం అందించారు. ఈవిషయాన్ని అత్యవసరంగా తీసుకున్న భద్రతా శాఖ అధికారులు వెంటనే స్పందించారు.
వివరాలు
ఆకతాయిలు చేసిన పనిగా నిర్దారించిన అధికారులు
ఆ విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించి, బాంబ్ స్క్వాడ్,డాగ్ స్క్వాడ్ సాయంతో సమగ్రంగా తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల సామాన్లు, విమానంలోని ప్రతి భాగాన్ని అత్యంత జాగ్రత్తగా పరిశీలించారు. గంటల పాటు కొనసాగిన ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబులు లేదా అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో ఇది బోగస్ అలారం అని స్పష్టమైంది. దీంతో ఇది ఎవరో ఆకతాయిలు చేసిన పనిగా అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి, టిష్యూ పేపర్పై ఆ సందేశం ఎవరు రాశారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఫేక్ బాంబ్ బెదిరింపులు విమానాశ్రయాల్లో పెరుగుతుండటంతో, భద్రతా వర్గాల్లో ఆందోళన నెలకొంది.