Bomb Threat: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు.. మరో రెండు ఫ్లైట్లకు బెదిరింపు మెయిల్స్
ఈ వార్తాకథనం ఏంటి
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. వరుసగా రెండు అంతర్జాతీయ ఫ్లైట్లకు అనామక మెయిల్స్ ద్వారా బాంబ్ హెచ్చరికలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోవైట్ నుంచి హైదరాబాదుకు బయలుదేరి శంషాబాద్ చేరే KU-373 ఫ్లైట్కు బెదిరింపు మెయిల్ రావడంతో, భద్రతా కారణాల దృష్ట్యా ఆ విమానాన్ని మస్కట్ వైపునకు మళ్లించారు. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానయాన అధికారులు తెలిపారు. అదే సమయంలో లండన్ నుంచి హైదరాబాదు వెళ్ళే బ్రిటిష్ ఎయిర్వేస్ BA-277 ఫ్లైట్కూ ఇదే తరహా బెదిరింపు మెయిల్ రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసర ప్రోటోకాల్ అమల్లోకి వచ్చింది.
Details
టర్మినల్ ప్రాంతంలో కూడా అదనపు భద్రతా చర్యలు
పైలట్ పరిస్థితిని పర్యవేక్షించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. వెంటనే ప్రోటోకాల్ ప్రకారం ప్రయాణికులను దింపి అసోలేషన్ ప్రాంతానికి తరలించారు. తదుపరి చర్యలలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు విమానాన్ని పూర్తిగా ఖాళీ చేసి తనిఖీలు ప్రారంభించాయి. టర్మినల్ ప్రాంతంలో కూడా అదనపు భద్రతా చర్యలు అమలు చేశారు. అన్ని కదలికలను కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నారు. సైబర్, ఇంటెలిజెన్స్ విభాగాలు సంయుక్తంగా ఈ బెదిరింపుల మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ ఘటన కారణంగా విమానాశ్రయంలో కొద్దిసేపు ఆందోళన నెలకొన్నా, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు.