LOADING...
Kakinada: కాకినాడలో దారుణ ఘటన.. పిల్లలను హత్య చేసి ఉరేసుకున్న తండ్రి
కాకినాడలో దారుణ ఘటన.. పిల్లలను హత్య చేసి ఉరేసుకున్న తండ్రి

Kakinada: కాకినాడలో దారుణ ఘటన.. పిల్లలను హత్య చేసి ఉరేసుకున్న తండ్రి

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2025
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాకినాడలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే వారి పాలిట కాలయముడిగా మారాడు. ఆరు, ఏడేళ్ల వయస్సున్న ఇద్దరు కొడుకులను హత్య చేసి, అనంతరం తానే ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘాతుకానికి కారణాలను వివరిస్తూ అతడు సూసైడ్ నోట్ రాశాడు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్ తన భార్య తనూజ, ఇద్దరు పిల్లలు జోషిల్ (7), నిఖిల్ (6)తో కలిసి కాకినాడలో నివాసం ఉంటున్నాడు. వాకలపూడిలోని ఓఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ ఎకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవలే పిల్లలు సరిగ్గా చదవడం లేదన్న కారణంతో వారి పాఠశాలను మార్పించాడు.

Details

ఘటన వివరాలు

హోలీ పండుగరోజు (శుక్రవారం) చంద్రకిశోర్ భార్య తనూజ, పిల్లలతో కలిసి కార్యాలయ వేడుకలకు వెళ్లాడు. అక్కడి నుంచి పిల్లల యూనిఫామ్ కొలతలు తీయించేందుకు టైలర్ వద్దకు తీసుకెళ్తానని చెప్పి భార్యను ఆఫీసు వద్దే ఉండమని సూచించాడు. అయితే ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆమె ఫోన్ చేసింది. అతను స్పందించకపోవడంతో తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి చేరుకుంది.

Details

తలుపులు తెరిచి చూడగానే షాక్!

కిటికీలోంచి చూడగానే భర్త ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు. భయంతో తలుపులు బలవంతంగా తెరిచి చూడగా ఇద్దరు కొడుకులు నీటితో నిండిన బకెట్లలో తల మునిగి పడి ఉన్నారు. ఈ దృశ్యాన్ని చూసిన ఆమె కన్నీరుమున్నీరైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

Details

సూసైడ్ నోట్ వివరాలు

చంద్రకిశోర్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రస్తుత పోటీ ప్రపంచంలో నా పిల్లలు నిలవలేకపోతున్నారు. వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. అందుకే వారిని చంపి తానే చనిపోతున్నాను," అని రాశాడు. అతని సోదరుడు మాట్లాడుతూ చంద్రకిశోర్‌కు ఆర్థిక ఇబ్బందులేమీ లేవు. అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటూ వాపోయాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.