Bullet Train: గంటకు 600 కి.మీ. వేగంతో బుల్లెట్ రైళ్లు.. ఏపీ మీదుగా హైస్పీడ్ కారిడార్లు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై, అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై నుంచి బెంగళూరు మధ్య ప్రతిపాదిత బుల్లెట్ రైలు కారిడార్లకు సంబంధించి రైల్వే శాఖ కీలక మార్పులు చేపట్టింది. ఇప్పటివరకు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిచేలా డిజైన్లు రూపొందిస్తుండగా, తాజాగా వాటిని గంటకు 600 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునే విధంగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే కారిడార్లు 600 కి.మీ. వేగాన్ని తట్టుకునేలా నిర్మించినప్పటికీ, బుల్లెట్ రైళ్లు గరిష్ఠంగా గంటకు 320 కి.మీ. వేగంతోనే నడిచే అవకాశం ఉంది.
వివరాలు
అమరావతి విమానాశ్రయం మీదుగా హైదరాబాద్-చెన్నై కారిడార్
హైదరాబాద్-అమరావతి-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్మెంట్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. అమరావతిలో నిర్మించనున్న విమానాశ్రయం మీదుగా ఈ లైన్ వెళ్లేలా మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతేడాది అక్టోబరులో రైల్వే అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో సూచించారు. అనంతరం అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపగా, కేంద్ర రైల్వే శాఖ దీనికి ఆమోదం తెలిపింది. ఈ కారిడార్కు సంబంధించి ప్రస్తుతం రెండు ఎలైన్మెంట్లను పరిశీలిస్తున్నారు. మొదటి ప్రతిపాదనను రైట్స్ రూపొందించింది.
వివరాలు
హైస్పీడ్ కారిడార్ పొడవు సుమారు 760 కి.మీ
దీని ప్రకారం హైదరాబాద్లోని ముంబయి వైపు వెళ్లే హైస్పీడ్ కారిడార్ పాయింట్ నుంచి శంషాబాద్, బాటసింగారం, నార్కెట్పల్లి, ఖమ్మం/కోదాడ మీదుగా ఏపీలోకి ప్రవేశించి అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి విమానాశ్రయం స్టేషన్ల మీదుగా చెన్నై సెంట్రల్ వరకు లైన్ వెళ్లనుంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించింది. దీని ప్రకారం శంషాబాద్, భారత్సిటీ (ఫ్యూచర్ సిటీ), దాచేపల్లి, అమరావతి మీదుగా వెళ్లి, అక్కడి నుంచి రైట్స్ ప్రతిపాదించిన మార్గాన్ని అనుసరించాలని సూచించింది. మొత్తంగా హైదరాబాద్-అమరావతి-చెన్నై హైస్పీడ్ కారిడార్ పొడవు సుమారు 760 కి.మీ. కాగా, ఇందులో 504 కి.మీ. ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండనుంది.
వివరాలు
హైదరాబాద్-బెంగళూరు కారిడార్
హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఎలైన్మెంట్ స్పష్టత వచ్చినప్పటికీ, తెలంగాణలో మాత్రం రెండు మార్గాలను పరిశీలిస్తున్నారు. రైల్వే శాఖ ప్రతిపాదన ప్రకారం హైదరాబాద్ నుంచి శంషాబాద్, భారత్సిటీ, మహబూబ్నగర్, వనపర్తి రోడ్ మీదుగా ఏపీలోని కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ (కియా పరిశ్రమ సమీపంలో), హిందూపురం మీదుగా కర్ణాటకలోని అలిపుర, దేవనహళ్లి, కొడిహళ్లి (వైట్ఫీల్డ్) మీదుగా బెంగళూరుకు ఈ కారిడార్ చేరుతుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మరో ప్రత్యామ్నాయాన్ని సూచించింది. శంషాబాద్, భారత్సిటీ, మన్ననూర్, సోమశిల రోడ్ మీదుగా ఏపీలో కర్నూలు వైపు కారిడార్ను మళ్లించాలని ప్రతిపాదించింది. ఈ హైదరాబాద్-బెంగళూరు కారిడార్ మొత్తం పొడవు సుమారు605 కి.మీ. కాగా, ఇందులో 263కి.మీ. ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంటుంది.
వివరాలు
చెన్నై-బెంగళూరు కారిడార్కు తిరుపతి అనుసంధానం
చెన్నై-బెంగళూరు మధ్య 306 కి.మీ. పొడవుతో హైస్పీడ్ రైల్ కారిడార్ను నిర్మించనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, పలమనేరు మీదుగా 90 కి.మీ. మేర మార్గం ఉంటుంది. అదే సమయంలో చిత్తూరు నుంచి తిరుపతికి 70 కి.మీ. ప్రత్యేక హైస్పీడ్ కారిడార్ను నిర్మిస్తే, ఒకవైపు చెన్నై-బెంగళూరు కారిడార్కు, మరోవైపు హైదరాబాద్-అమరావతి-చెన్నై కారిడార్కు అనుసంధానం లభిస్తుందని సీఎం చంద్రబాబు గతంలో రైల్వే అధికారులకు సూచించారు. ఇటీవల అశ్వనీ వైష్ణవ్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చిత్తూరు-తిరుపతి హైస్పీడ్ కారిడార్ ప్రతిపాదనను పరిశీలిస్తామని రైల్వే మంత్రి హామీ ఇచ్చారు.
వివరాలు
తర్వాత దశలో విజయవాడ-విశాఖ కారిడార్
విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు కూడా హైస్పీడ్ రైల్ కారిడార్ను నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. దీనిపై గత నెల జరిగిన సమావేశంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను — ఇందులో ఏపీ మీదుగా వెళ్లే మూడు కారిడార్లు కూడా ఉన్నాయి ముందుగా పూర్తి చేస్తామని, ఆ తర్వాత దశలో విజయవాడ-విశాఖపట్నం కారిడార్ను పరిశీలిస్తామని స్పష్టం చేశారు.