LOADING...
Buss Fire Accident: రన్నింగ్‌ బస్సులో అగ్నిప్రమాదం: 20 మంది దుర్మరణం.. బాధితులకు ప్రధాని ఎక్స్‌గ్రేషియా ప్రకటన
రన్నింగ్‌ బస్సులో అగ్నిప్రమాదం: 20 మంది దుర్మరణం.. బాధితులకు ప్రధాని ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Buss Fire Accident: రన్నింగ్‌ బస్సులో అగ్నిప్రమాదం: 20 మంది దుర్మరణం.. బాధితులకు ప్రధాని ఎక్స్‌గ్రేషియా ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2025
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో భారీ విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి భీకర ప్రమాదానికి దారితీశాయి. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. చాలామంది ప్రయాణికులు బస్సులోనే సజీవదహనమయ్యారు. కొందరు మాత్రం కిటికీలు పగులగొట్టి బయటపడగలిగారు. మంటలు మొదలయ్యే సరికి బస్సు డోర్లు లాక్ అయిపోవడం వల్ల బయటకు రావడానికి అవకాశం లేకపోయిందని తెలుస్తోంది. ఆ సమయానికి బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 19 మంది తీవ్రంగా గాయపడి, వారిని జోధ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో నలుగురు మరణించగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Details

పలువురి పరిస్థితి విషమం

కొంతమంది ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించారు. మృతుల్లో స్థానిక జర్నలిస్ట్ రాజేంద్ర సింగ్ చౌహాన్ కూడా ఉన్నారని సమాచారం. జైసల్మేర్ నుండి జోధ్‌పూర్‌కి వెళ్తున్న ఈ బస్సులో ఏసీ యూనిట్‌లో అకస్మాత్తుగా మంటలు ప్రారంభమయ్యాయి. కొద్ది నిమిషాల్లోనే మంటలు వాహనమంతా వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే పలువురి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ తక్షణ చర్యలు ప్రారంభించారు. ఆయన బిహార్ పర్యటనను రద్దు చేసుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.బాధితుల్లో చాలామంది 70శాతం పైగా కాలిన గాయాలతో మృతిచెందారని సీఎం వెల్లడించారు. మృతుల్లో మహేంద్ర అనే సైనికుడు, అతని భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.

Details

గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి

మహేంద్ర జైసల్మేర్‌లోని ఒక ఆయుధ డిపోలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు ఆ కుటుంబ వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ప్రాణనష్టం బాధాకరమని పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా సాయం ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా స్పందించారు. బస్సులో మంటల కారణంగా 20 మంది మరణించడం హృదయ విదారకమని, ఈ విషాదం తాను విన్న వెంటనే కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.