
10th Exams: 'పది' పరీక్షలు ఏడాదికి రెండు సార్లు.. 2026 నుంచి సీబీఎస్ఈ నూతన విధానం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) పదో తరగతి పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరిలో నిర్వహించే మొదటి విడత పరీక్షలు తప్పనిసరి కాగా, మే నెలలో జరిగే రెండో విడత పరీక్షలను ఐచ్ఛికంగా ఉంచింది. 2026 నుండి ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు సీబీఎస్ఈ తాజాగా కొత్త నిబంధనలకు ఆమోదం తెలిపింది. విద్యార్థులపై బోర్డు పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు నూతన జాతీయ విద్యా విధానం (NEP) పలు సూచనలను చేసింది. ఈ సూచనల ప్రకారమే ఫిబ్రవరి, మే నెలల్లో రెండు విడతల్లో పరీక్షలను నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ పరీక్షల విభాగాధిపతి సన్యం భరద్వాజ్ తెలిపారు.
Details
మార్కులను మెరుగుపరచేందుకు అవకాశం
మొదటి విడత పరీక్షా ఫలితాలను ఏప్రిల్లో, రెండో విడత ఫలితాలను జూన్లో ప్రకటిస్తామని చెప్పారు. ఈ విధానం ద్వారా విద్యార్థులకు మార్కులు మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని వివరించారు. అయితే, అంతర్గత మదింపు (Internal Assessment) మాత్రం మునుపటిలాగే సంవత్సరానికి ఒకసారి ఉంటుందని తెలిపారు. ఇంతకుముందే పదో తరగతి పరీక్షలను రెండు దశల్లో నిర్వహించే నిబంధనల ముసాయిదాను సీబీఎస్ఈ విడుదల చేసింది. రెండు విడతల పరీక్షలకూ పూర్తి సిలబస్ వర్తిస్తుందని అందులో పేర్కొంది. ఈ విధానం పై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన బోర్డు, ఇప్పుడు అమలుకు సిద్ధమయింది.