Page Loader
Budget 2025: ఏఐ అభివృద్ధికి కేంద్రం రూ.500 కోట్ల కేటాయింపు.. భారత విద్యా రంగంలో కీలక మార్పులు 
ఏఐ అభివృద్ధికి కేంద్రం రూ.500 కోట్ల కేటాయింపు.. భారత విద్యా రంగంలో కీలక మార్పులు

Budget 2025: ఏఐ అభివృద్ధికి కేంద్రం రూ.500 కోట్ల కేటాయింపు.. భారత విద్యా రంగంలో కీలక మార్పులు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 01, 2025
01:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2025-26 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌లో AI అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తూ, ఈ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.500 కోట్లను AI అభివృద్ధి కోసం కేటాయించినట్లు ప్రకటించారు. భారతదేశంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, కేంద్రం మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయనుందని వెల్లడించింది. ఈ కేంద్రాలు అధునాతన AI పరిశోధనకు, విద్యా రంగంలో AI వినియోగాన్ని పెంచేందుకు కీలక పాత్ర పోషించనున్నాయి.

Details

మౌలిక సదుపాయాల కోసం నిధులు

AI ఆధారిత ట్యూటరింగ్ సిస్టమ్స్, ఆటోమేటెడ్ అసెస్‌మెంట్‌లు, వ్యక్తిగతీకరించిన అభ్యాస అనుభవాలను అందించేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని ఆర్థిక మంత్రి తెలిపారు. AI అభివృద్ధితో పాటు, ఐదు కొత్త IITలలో మౌలిక సదుపాయాల విస్తరణకు నిధులను కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ విస్తరణ ద్వారా అదనంగా 6,500 విద్యార్థులకు వసతి, విద్యా సదుపాయాలు అందించనున్నాయి. IIT భిలాయ్, IIT ధార్వాడ్, IIT గోవా, IIT జమ్మూ, IIT తిరుపతి ఈ విస్తరణ పొందనున్నాయి. సాంకేతికత, AI, విద్య - ఈ మూడు రంగాల్లో అభివృద్ధి సాధించి, 2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని చేరుకోవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించుకున్నది.

Details

అగ్రగామిగా నిలిచేందుకు కృషి

AI పరిశోధనను వేగవంతం చేసి, దేశాన్ని AI రంగంలో అగ్రగామిగా మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయాలను పరిశ్రమ నిపుణులు స్వాగతిస్తున్నారు. AI ప్రతిభను పెంచేందుకు, పరిశోధన అవకాశాలను మెరుగుపర్చేందుకు, విద్యా వ్యవస్థను ఆధునికంగా తీర్చిద్దేందుకు కేంద్రం తీసుకున్న ఈ చర్యలు కీలకమైన మార్పులను తీసుకొస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. AI వినియోగానికి సంబంధించిన కేంద్ర నిర్ణయాలు భారత విద్యా వ్యవస్థను ప్రభావితం చేస్తూ, దేశ భవిష్యత్తుకు కీలక మలుపుగా మారనున్నాయి.