Visakhapatnam: విశాఖకు కేంద్రం గ్రీన్సిగ్నల్.. మూడు కీలక ప్రాజెక్టులకు ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ సౌకర్యాల మెరుగుదలకు సంబంధించిన మూడు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విశాఖ ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం పరిధిలో జీవీఎంసీ ప్రతిపాదించిన ప్రాజెక్టులకు నేషనల్ అపెక్స్ కమిటీ అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులను మొత్తం రూ.1,501.03 కోట్ల వ్యయంతో అమలు చేయనున్నట్లు చెప్పారు. ఇందులో మధురవాడ జోన్లో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ అభివృద్ధికి రూ.658.61 కోట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే అదే ప్రాంతంలో ఆధునిక తాగునీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు కోసం రూ.725.18 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు.
వివరాలు
బల్క్, సెమీ బల్క్ నీటి సరఫరా వ్యవస్థ ఆధునీకరణ
ఇక బల్క్, సెమీ బల్క్ నీటి సరఫరా వ్యవస్థను ఆధునీకరించేందుకు రూ.117.24 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మూడు ప్రాజెక్టులు అమల్లోకి వస్తే విశాఖపట్నంలో పట్టణ మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎంపీ శ్రీభరత్ తెలిపారు.