Centre: ఎయిర్లైన్స్ అభ్యంతరాలతో 60% ఫ్రీ సీట్ల నిబంధనపై కేంద్రం యూ-టర్న్
ఈ వార్తాకథనం ఏంటి
ఎయిర్లైన్స్ నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో విమానాల్లో 60% సీట్లను ఉచితంగా ఎంపిక చేసుకునేలా చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నిబంధన అమల్లోకి రావడానికి కొన్ని వారాల ముందే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్,అకాసా ఎయిర్ ప్రతిపాదనలు,అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ 60% ఉచిత సీట్ల విధానం వల్ల ఆపరేషనల్, కమర్షియల్ ప్రభావాలు ఉంటాయని, ముఖ్యంగా టికెట్ ధరల నిర్మాణం,ప్రస్తుత డీ-రెగ్యులేటెడ్ టారిఫ్ విధానంపై ప్రభావం పడుతుందని ఎయిర్లైన్స్ పేర్కొన్నాయి. అసలు ఈ ఆదేశం ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.
వివరాలు
పెరిగిన ఎయిర్లైన్స్ ఖర్చులు
ముందుగా కేవలం 20% సీట్లు మాత్రమే ఉచితంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉండేది,మిగతా సీట్లకు రూ.200 నుంచి రూ.2,100 వరకు చార్జీలు ఉండేవి. 60% ఉచిత సీట్ల నిబంధన అమలు చేస్తే ఆదాయం తగ్గిపోతుందని,దాన్ని భర్తీ చేయడానికి టికెట్ ధరలు పెంచాల్సి వస్తుందని ఎయిర్లైన్స్ అభిప్రాయపడ్డాయి. మరోవైపు ఇరాన్ యుద్ధం కారణంగా విమాన ఇంధనమైన ఏటీఎఫ్ ధరలు పెరగడం వల్ల కూడా ఎయిర్లైన్స్ ఖర్చులు పెరిగాయి. అయితే,ఇతర ప్రయాణికుల సౌకర్యాలకు సంబంధించిన నిబంధనలు మాత్రం కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇందులో సీట్ల కేటాయింపులో పారదర్శకత,ఒకే పీఎన్ఆర్లో ఉన్న ప్రయాణికులను కలిపి కూర్చోబెట్టడం,సంగీత వాద్యాలు,క్రీడా పరికరాలు,పెంపుడు జంతువుల రవాణా వంటి అంశాలు, అలాగే చార్జీలను స్పష్టంగా తెలియజేయడం వంటి నిబంధనలు కొనసాగుతాయి.