
Chenab river: జమ్ముకశ్మీర్లోని చీనాబ్ నదికి భారీగా వరద.. దోడాలో పలువురు గల్లంతు..!
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్'లో గత కొన్ని రోజులుగా కుంభవృష్టి కురుస్తోంది.నిరంతరం పడుతున్న వర్షాల కారణంగా అక్కడి నదులు,వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా చీనాబ్ నది ప్రమాదకర స్థాయిలో పొంగిపొర్లుతూ భయాందోళనకు గురి చేస్తోంది. బాగ్లిహార్ జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద ఈ నది పెరిగిన ప్రవాహంతో అట్టడుగు నుంచి నీరు ఉప్పొంగుతూ ప్రవహిస్తోంది. చీనాబ్ నది ఉగ్రవేగం వల్ల దోడా జిల్లాలో పలువురు నీటిలో గల్లంతయ్యారు అనే సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో దోడా-కిష్ట్వార్-రాంబన్ ప్రాంతాల డీఐజీ శ్రీధర్ పాటిల్ ప్రజలకు అప్రమత్తత సూచనలు చేశారు.
వివరాలు
వచ్చే మూడునాలుగు రోజులపాటు వర్షాలు
ప్రస్తుతం చీనాబ్ నది చాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందని, దోడా జిల్లాలో ఈ నదిలో కొట్టుకుపోయి కొన్ని ప్రాణనష్టం సంభవించిందని తెలిపారు. ప్రజలు నదులు, వాగులు, వంకల చుట్టుపక్కలకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇక, తావీ నదిలో కూడా వరద ఉధృతి పెరిగింది. బుధవారం నాడు ఓ వ్యక్తి ఈ నదిలో చిక్కుకున్నాడు. ఘటన స్థలానికి సమయానికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందం అతడిని సురక్షితంగా బయటకు తీశారు. మరోవైపు, భారత వాతావరణ శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, జమ్మూ కశ్మీర్తో పాటు లడఖ్, గిల్గిట్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో వచ్చే మూడునాలుగు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది.