Chickpea Prices: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. పెరిగిన శనగ ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
గత రెండేళ్లుగా బహిరంగ మార్కెట్లో క్వింటా శనగ ధర రూ.5 వేల లోపే కొనసాగగా,ప్రస్తుతం ఒక్కసారిగా రూ.6 వేలు దాటింది. రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో శనగ సాగు విస్తృతంగా జరుగుతోంది. గతంలో ఎర్ర శనగలకు క్వింటాకు రూ.8 వేల వరకు ధర రావడంతో, భవిష్యత్తులో మరింత పెరుగుతుందనే ఆశతో రైతులు పెద్దఎత్తున శీతల గిడ్డంగుల్లో నిల్వ చేశారు. అయితే గత రెండేళ్లుగా ఆశించిన స్థాయిలో ధరలు పెరగకపోవడంతో గిడ్డంగుల్లో నిల్వలు భారీగా పేరుకుపోయాయి. రైతుల అభ్యర్థనల మేరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, క్వింటాకు రూ.5,875 మద్దతు ధర ప్రకటించి కొనుగోళ్లు చేపట్టింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 84 వేల మెట్రిక్ టన్నుల శనగలను సేకరించింది.
వివరాలు
బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర
ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా విదేశీ దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో శనగలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో క్వింటా శనగ ధర రూ.6 వేలకు చేరుకోగా, రాయలసీమ జిల్లాల్లో రూ.6,100 వరకు పలుకుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల కంటే బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర లభిస్తుండటంతో రైతులు వ్యాపారులకు అమ్మకాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.