Telangana: 20న మేడిగడ్డ పరిశీలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 20వ తేదీన భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు బుధవారం కాటారం మండలం ధన్వాడలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా పోలీసు అధికారి సిరిశెట్టి సంకీర్త్తో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. సభను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
వివరాలు
సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లపై చర్చ
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడం నేపథ్యంలో జాతీయ ఆనకట్ట భద్రత సంస్థ సూచనల మేరకు మరమ్మతులు, సాంకేతిక పరీక్షలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో బ్యారేజీ ప్రస్తుత స్థితిని ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా పరిశీలించి, తదుపరి చర్యలపై సమీక్ష జరపనున్నారు. అలాగే కాళేశ్వరంలో మే నెలలో నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లపై కూడా ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఈ కార్యక్రమాల్లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొననున్నారు.