NCRB: దేశంలో చిన్నారులపై 96 శాతం పెరిగిన అత్యాచారాలు
దేశంలో చిన్నారులపై నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దేశంలో 2016-2022 మధ్య కాలంలో పిల్లలపై అత్యాచారం కేసులు భయంకరంగా పెరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ఆధారంగా ఎన్జీఓ సంస్థ చైల్డ్ రైట్స్ అండ్ యూ (CRY) ఈ డేటాను వెల్లడించింది. 2016 నుంచి 2022 మధ్య కాలంలో ఇటువంటి కేసులు 96.8 శాతం పెరిగాయని 'CRY' తన నివేదికలో పేర్కొంది. 2021లో మొత్తం 36,381 కేసులు నమోదయ్యాయి. 2020లో ఈ సంఖ్య 30,705గా ఉంది. 2019లో 31,132, 2018లో 30,917, 2017లో 27,616 కేసులు నమోదయ్యాయి. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2016లో 19,765 కేసులు నమోదయ్యాయి.
కేసులు ఎందుకు పెరిగాయి?
అవగాహన కారణంగా పిల్లలపై లైంగిక నేరాల కేసులు ఎక్కువగా నమోదయ్యాయని CRY ఎన్జీఓ డైరెక్టర్ శుభేందు భట్టాచార్జీ అన్నారు. హెల్ప్లైన్లు, ఆన్లైన్ పోర్టల్లు, ప్రత్యేక ఏజెన్సీలు అందుబాటులోకి రావడంతో బాధితులు సులభంగా ఫిర్యాదులు చేసుకుంటున్న నేపథ్యంలో కేసులు పెరిగాయని భట్టాచార్జీ తెలిపారు. చట్టపరమైన సంస్కరణలు, విధాన మార్పుల వల్ల కేసుల రిపోర్టింగ్లో పెరుగుదలకు కారణమని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా పిల్లల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భట్టాచార్జీ వెల్లడించారు. పిల్లలపై జరిగే నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం అవసరమని నొక్కి చెప్పారు.