Visakhapatnam: విశాఖలో తహసీల్దార్ దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ రెవెన్యూ యంత్రాంగం
విశాఖ జిల్లాలో ల్యాండ్ మాఫియా ఘాతుకానికి పాల్పడింది. మధురవాడలోని కొమ్మాదిలో తహసీల్దార్ను దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో ఏపీలోని రెవెన్యూ యంత్రాంగం ఉలిక్కిపడింది. తన ఇంటి సమీపంలోనే తహసీల్దార్ సనపల రమణయ్యపై దాడి చేసి హత్య చేసినట్లు సీసీటీవీ పుటేజీలో చూస్తే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నేపథ్యంలో రమణయ్యను ఇటీవల విశాఖ రూరల్ (చినగదిలి) మండలం నుంచి విజయనగరం జిల్లాలోని బొండపల్లి తహసీల్దార్గా బదిలీ చేశారు. కొమ్మాదిలోని ఓ అపార్ట్మెంట్ ఆయన నివాసం ఉంటున్నారు. అయితే శుక్రవారం బొండపల్లిలో విధులు నిర్వహించి.. ఇంటికి వచ్చారు.
నిందితుడి కోసం పోలీసుల గాలింపు
శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో రమణయ్యకు ఫోన్ వచ్చింది. దీంతో ఆయన అపార్ట్మెంట్ కిందకు వచ్చారు. అనంతరం ఆయన గేట్ వద్ద ఓ వ్యక్తిని కలిసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో దుండగుడు ఇనుపరాడ్తో తహసీల్దార్పై దాడి చేసి పరారయ్యాడు. అయితే తలకు తీవ్ర గాయాలు కావడంతో రమణయ్య కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన వాచ్మెన్ కుటుంబసభ్యులకు ఇచ్చాడు. వెంటనే రమణయ్యను ఆస్పత్రికి తరలించారు. రమణయ్య చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దాడి చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.