Cm chandrababu: దివ్యాంగులకు ఏడు వరాలు ప్రకటించిన సీఎంచంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగుల కోసం విస్తృతమైన పథకాలను ప్రకటించారు. 'ఇంద్రధనుస్సు' పేరుతో ఏడు ప్రత్యేక వరాలను అమలు చేయనున్నట్టు ప్రకటించారు. దీంట్లో, ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేయడం, ఎన్నికల్లో ఎవరూ గెలవకపోతే ఎక్స్అఫీషియో మెంబర్ పదవిని కేటాయించడం వంటి ఏర్పాట్లు ఉన్నాయి. ఈ నిర్ణయాల వెనుక లక్ష్యం దివ్యాంగులు రాజకీయాల్లో పాల్గొని ప్రజాసేవలో ముందుండే అవకాశాలను కల్పించడం. అంతేకాక, దివ్యాంగులకు ప్రత్యేక ఆర్థిక రాయితీ రుణ పథకాన్ని పునరుద్ధరించ, దానికి రూ.19 కోట్ల వ్యయం కేటాయించనున్నట్టు చెప్పారు.
వివరాలు
దివ్యాంగులకు అనుకూల నగరంగా అమరావతి
శాప్ ద్వారా అన్ని క్రీడా,ప్రతిభా అభివృద్ధి కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురావడం, బహుళ అంతస్తుల ప్రభుత్వ గృహాల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇళ్లు కేటాయించడం, వినికిడి లోపం ఉన్న వారికి ప్రత్యేక డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడం,గురుకుల పాఠశాలలు,కళాశాలలు,వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేయడం,అన్ని జిల్లాలా, అమరావతిలో ప్రత్యేక 'దివ్యాంగ భవనాలు' ఏర్పాటు చేయడం వంటి పథకాలను ప్రకటించారు. రాజధాని నగరాన్ని దివ్యాంగులకు అనుకూల నగరంగా మార్చడం ప్రధాన లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివ్యాంగులకు ఉపకార వేతనాలు, శిరీషకు రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనం, మనోజ్కు ల్యాప్టాప్, గ్లోరీకి టచ్ ఫోన్ పంపిణీ చేశారు.
వివరాలు
1800 మంది దివ్యాంగులకు రెట్రోఫిటెడ్ మోటారు వాహనాలు
అనంతరం ఆయన మాట్లాడుతూ, విశాఖలో 23 ఎకరాల్లో నేషనల్ సెంటర్ ఫర్ డిజేబులిటీ స్పోర్ట్స్ స్టేడియంను నిర్మిస్తామని, దివ్యాంగులు క్రీడల్లో ముందుండేలా ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పారు. రెట్రోఫిటెడ్ మోటారు వాహనాలను 1800 మంది దివ్యాంగులకు ఈ ఏడాది అందిస్తామని, ట్రైసైకిళ్లు, వినికిడి పరికరాలు, వీల్చైర్లు 14,000 మందికి అందించబోతున్నామని, దివ్యాంగులకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ గడువును పొడిగిస్తున్నట్లు చెప్పారు. మెగా డీఎస్సీ ద్వారా 2260 స్పెషల్ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేశామని వెల్లడించారు.
వివరాలు
పింఛన్ల పంపిణీకి రూ.6వేల కోట్లు ఖర్చు
దివ్యాంగులకు ఎన్టీఆర్ అప్పట్లో తొలిసారి పింఛన్లు మంజూరు చేశారు.నేను రూ.200 నుంచి రూ.6 వేల వరకు విడతల వారీగా పెంచా. దేశంలో మరే రాష్ట్రంలోనూ రూ.6 వేల పింఛను ఇవ్వడం లేదు. ఏడాదికి 7.68లక్షల మందికి పింఛన్ల పంపిణీకిగాను రూ.6వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం' అని సీఎం తెలిపారు. వైకాపాప్రభుత్వంలో దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన ఏ కార్యక్రమం నిర్వహించలేదు, అంతర్జాతీయ దినోత్సవం కూడా జరపలేదు,ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు, దివ్యాంగులపై పార్టీ నేతలు కక్షకట్టి దాడులు చేశారని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి,ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్రావు,ఎంఎస్ రాజు,ఎమ్మెల్సీ తిప్పేస్వామి,దివ్యాంగుల అభివృద్ధి,సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ నారాయణ స్వామి,తెదేపా విభాగ అధ్యక్షులు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.