
AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరుగనుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చ జరగబోతోంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయడం, ఇతర సంక్షేమ కార్యక్రమాలపై చర్చించేందుకు అవకాశముంది. అలాగే, ముఖ్యమంత్రి చంద్రబాబు డావోస్ పర్యటనపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే, ఆ అంశంపై కూడా సమావేశం అనంతరం చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వివరాలు
రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశం
సచివాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే కేబినెట్ సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశం ఉంది. పలు కంపెనీలకు భూముల కేటాయింపునకు ఆమోదముద్ర వేసే అవకాశమున్నది. మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10 శాతం కేటాయింపుపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. గీతకార్మికులకు ఇచ్చే షాపుల విషయంలో కూడా కేబినెట్ ఆమోదం ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం, మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశముంది.