ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట; ప్రభుత్వం ఆధ్వర్యంలో రైస్ మిల్లుల ఏర్పాటు
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల వేళ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వరిధాన్యాన్ని వివిధ ఉత్పత్తులుగా మార్చేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అన్ని జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేసినట్లయితే, వరి ఉత్పత్తిలో ఇప్పటికే దేశంలోనే నంబర్వన్ స్థానానికి చేరుకున్న తెలంగాణ రైతులు, తమ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లో విక్రయించి, అధిక లాభాలు ఆర్జించగలుగుతారని చెప్పారు. అలాగే రాష్ట్రంలో పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రైస్ మిల్లులను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైస్ మిల్లుల ఏర్పాటుపై జపాన్కు చెందిన ప్రముఖ రైస్ మిల్ కంపెనీ సాటేక్ కార్పొరేషన్ ప్రతినిధులతో కేసీఆర్ చర్చించారు.
రైతులను వ్యాపారులుగా మార్చుతాం: సీఎం
తెలంగాణ నుంచి ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులకు ప్రపంచ స్థాయిలో మార్కెట్ కల్పించే బాధ్యతను కూడా కార్పొరేషన్ తీసుకుంటందని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతులను వ్యాపారులుగా మార్చే పనిని పౌరసరఫరాల శాఖ తీసుకుంటుందని, రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తి మిల్లులను ఏర్పాటు చేసి వాటిని రైస్ మిల్లులకు అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఇందుకోసం మరిన్ని గోదాములు కూడా నిర్మించాలన్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. ఈ మొత్తం కార్యక్రమానికి దాదాపు రూ.2వేల కోట్లు కోట్లు అవుతందని సీఎం కేసీఆర్ అంచనా వేశారు. త్వరలోనే ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు.