TG News: తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై సమగ్ర అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. కమిటీలో ప్రొఫెసర్ కోదండరాం, కంచ ఐలయ్య, ఆర్థిక, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖల కార్యదర్శులు, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ మరియు ఉన్నత విద్యాసంస్థల నుండి ముగ్గురు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
వివరాలు
మూడు నెలల్లో నివేదిక
ఈ కమిటీ, ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై సమీక్ష చేసి, ప్రభుత్వానికి తగిన సూచనలు అందించనుంది. అలాగే, ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేసే అవకాశాలను కూడా ఈ కమిటీ పరిశీలించనుంది. మూడు నెలల వ్యవధిలో నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. అదనంగా, విద్యా సంస్థలు అందించిన సూచనలను కూడా కమిటీ పరిశీలించి తన నివేదికలో భాగం చేయాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. గత నెల 28న జారీ చేసిన జీవోను ప్రభుత్వం తాజాగా ప్రజలకు విడుదల చేసింది.