Sanchar Saathi : సంచార్ సాథీ యాప్పై దుమారం.. పార్లమెంటులో రేణుకా చౌదరి అడ్జర్న్మెంట్ మోషన్
ఈ వార్తాకథనం ఏంటి
సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన "సంచార్ సాథీ" యాప్ను ఇకపై ప్రతి కొత్త మొబైల్ ఫోన్లో ముందుగానే ఇన్బిల్డ్గా ఇన్స్టాల్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి భారత్కు దిగుమతి అయ్యే అన్ని స్మార్ట్ఫోన్లలో కూడా ఈ యాప్ తప్పనిసరిగా ముందే లోడ్ అయి ఉండాలని సూచించింది. ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంటులో అడ్జర్న్మెంట్ మోషన్ దాఖలు చేశారు. టెలికం శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్-DoT) జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం మొబైల్ తయారీ సంస్థలు,దిగుమతిదారులు ఈ యాప్ను యూజర్లు తొలగించలేని విధంగా ముందే ఇన్స్టాల్ చేయాల్సి వస్తోందని ఆమె ఆరోపించారు.
వివరాలు
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద హామీ ఇచ్చిన గోప్యత హక్కుకు పూర్తిగా విరుద్ధం
ఈ వ్యవహారం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద హామీ ఇచ్చిన గోప్యత హక్కుకు పూర్తిగా విరుద్ధమని రేణుకా చౌదరి పేర్కొన్నారు. గోప్యత హక్కు అనేది జీవన హక్కు,వ్యక్తిగత స్వేచ్ఛలో విడదీయరాని భాగమని,అలాంటి కీలక హక్కును ఉల్లంఘించేలా యాప్ను తొలగించలేని స్థితిలో బలవంతంగా ముందే లోడ్ చేయడం సరికాదని ఆమె విమర్శించారు. సరైన రక్షణ చర్యలు,పార్లమెంటరీ పర్యవేక్షణ లేకుండానే ఈ నిబంధన అమలు చేస్తే ప్రజల కదలికలు,సంభాషణలు, వ్యక్తిగత నిర్ణయాలు అన్నీ నిరంతరం పర్యవేక్షించబడే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని,దీనివల్ల దేశ పౌరులందరిపైనా 'నిరంతర నిఘా' ఏర్పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అత్యంత సున్నిత అంశంపై వెంటనే సభలో చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ రేణుకాచౌదరి అడ్జర్న్మెంట్ మోషన్లో కోరారు.