
దగ్గుమందుతో కామెరూన్ లో చిన్నారుల మృతి.. మరోసారి భారత్పైనే అనుమానాలు
ఈ వార్తాకథనం ఏంటి
కాఫ్ సిరప్ కల్తీ కారణంగా చిన్నారులు మృతి చెందిన హృదయవిదారక ఘటన కామెరూన్ లో జరిగింది. ప్రాణాంతకరంగా మారిన సదరు ఔషధం భారత్లోనే తయారైందనే అనుమానాలకు తావిస్తోంది.
సెంట్రల్ ఆఫ్రికన్ దేశం కామెరూన్ లో గత కొంత కాలంగా చిన్నారులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీరి మరణాలకు దగ్గుమందే కారణమని ఆ దేశ వైద్యాధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.
నేచర్ కోల్డ్ దగ్గుమందు తయారీ లైసెన్స్ నంబర్, భారత్కు చెందిన ఓ సంస్థతో మ్యాచ్ అయిందని సమాచారం. కామెరూన్ దేశంలో గత కొన్ని రోజలుగా చిన్నారుల మరణాలు ఎక్కువయ్యాయి.
దాదాపుగా 12 మంది ప్రాణాలు కోల్పోవడంపై దర్యాప్తు ప్రారంభమైంది. ఈ క్రమంలో సిరప్ ఫొటోలను అక్కడి అధికారులు రిలీజ్ చేశారు.
DETAILS
తాము ఎగుమతి చేసిన ఔషధాలెక్కడా కల్తీ కాలేదు: నవీన్ భాటియా
నేచర్కోల్డ్ మందు డబ్బాలపై తయారీదారుడి పేరు రాయలేదు. కేవలం తయారీ లైసెన్స్ నంబర్ మాత్రమే ముద్రించగా, అది భారత్కు చెందిన సంస్థగా భావిస్తున్నారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరానికి చెందిన రీమన్ ల్యాబ్స్కూ సేమ్ లైసెన్స్ ఉన్న విషయాన్ని ఓ ఆంగ్ల మీడియా కథనం వెలువరించింది.
ఈ నేపథ్యంలోనే ఈ ఔషధం భారత్లోనే తయారైందని అనుమానిస్తున్నారు. అది తమ సంస్థ తయారు చేసిన ఔషధం లాగే ఉందని రీమన్ డైరెక్టర్ నవీన్ భాటియా వెల్లడించారు.
అయితే, ప్రపంచంలో చాలా రకాల మందులకు నకిలీలున్నాయని, తాము ఎగుమతి చేసిన ఔషధాలెక్కడా కల్తీ కాలేదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎగుమతి చేసే దగ్గు మందులకు ప్రభుత్వ ల్యాబ్ అనుమతిని గతంలోనే కేంద్రం తప్పనిసరి చేసింది.