LOADING...
Andhra Pradesh: ఏపీలో స్థానిక ఎన్నికలకు కౌంట్‌డౌన్‌.. బ్యాలెట్‌ బాక్సుల సమీకరణలో వేగం!
ఏపీలో స్థానిక ఎన్నికలకు కౌంట్‌డౌన్‌.. బ్యాలెట్‌ బాక్సుల సమీకరణలో వేగం!

Andhra Pradesh: ఏపీలో స్థానిక ఎన్నికలకు కౌంట్‌డౌన్‌.. బ్యాలెట్‌ బాక్సుల సమీకరణలో వేగం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2025
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోసం ప్రక్రియ జోరందుకుంటుండగా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) చర్యలను మరింత వేగవంతం చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం మున్సిపల్ మరియు పంచాయతీరాజ్‌ శాఖలకు పలువురు కీలక సూచనలతో లేఖలు పంపినట్లు సమాచారం. అలాగే, 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషనర్ కార్యాలయం ఇప్పటికే సేకరించింది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Details

పెద్ద ఎత్తున బ్యాలెట్ బాక్సులు తెప్పించేందుకు ప్రయత్నం

ఇదిలా ఉండగా, రాజకీయ పార్టీలు కూడా ముందస్తుగానే మైదానంలోకి దిగి, తమ కార్యకర్తలకు ఎన్నికల సిద్ధతలపై సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోసం పెద్ద ఎత్తున బ్యాలెట్‌ బాక్సులు ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించేందుకు ఎన్నికల సంఘం వ్యూహరచన చేస్తోంది. అదనంగా, పంచాయతీరాజ్‌ మరియు మున్సిపల్‌ శాఖల నుండి అదనపు సిబ్బందిని ఎన్నికల డ్యూటీలకు అందించాలని SEC భావిస్తోంది. వైసీపీ ప్రభుత్వ కాలంలో చివరిసారిగా 2021 ఫిబ్రవరి, ఏప్రిల్‌ నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు.

Details

మార్చి 17 నాటికి మున్సిపల్ సంస్థల గడువు పూర్తి

గ్రామ పంచాయతీల పదవీ గడువు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 2తో ముగియనుండగా, మున్సిపల్‌ సంస్థల గడువు మార్చి 17తో పూర్తికానుంది. MPTC, ZPTC సంస్థల గడువు కూడా సెప్టెంబర్‌ 3, 4 తేదీలతో ముగుస్తుంది. మొత్తం 127 మున్సిపాలిటీలలో గతసారి 87 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించగా, 23 చోట్ల ఎన్నికలు జరగలేదు. 17 ప్రాంతాల్లో దశలవారీగా పోలింగ్‌ జరిగింది. ఇక పంచాయతీల విలీనానికి సంబంధించిన క్లియరెన్స్ ఈ నెలాఖరులో రావచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.