Cyclone Montha: కాకినాడకు 130 కి.మీ దూరంలో మొంథా తుపాను.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ తుపాను విశాఖపట్నానికి దక్షిణంగా సుమారు 230 కి.మీ, కాకినాడకు ఆగ్నేయంగా 130 కి.మీ, అలాగే మచిలీపట్నానికి దక్షిణ-ఆగ్నేయ దిశగా 50 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత ఆరు గంటల్లో తుపాను గంటకు సుమారు 15 కి.మీ వేగంతో కదులుతోందని తెలిపిన అధికారులు, ఇది ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ ఇవాళ రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. తీరం దాటే సమయానికి గాలుల వేగం గంటకు 90 నుంచి 110 కి.మీ వరకు ఉండవచ్చని సూచించారు.
వివరాలు
కాకినాడ, యానాం తీర ప్రాంతాలకు ఉప్పెన ముప్పు
తుపాను ప్రభావం కారణంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తారంగా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో గాలుల తీవ్రత పెరుగుతోంది. కాకినాడ తీర ప్రాంతంలో సముద్ర కెరటాలు ఎగసిపడుతున్నాయి. కాకినాడ, యానాం తీర ప్రాంతాలకు ఉప్పెన ముప్పు ఉందని నిపుణులు తెలిపారు. యానాం ప్రాంతంలోని కనకలపేట, గెస్ట్హౌస్, పాత కోర్టు భవనం, ఎస్ఆర్కే కళాశాల ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. నేలకూలిన చెట్లను సహాయక బృందాలు వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. అగ్నిమాపక, విద్యుత్ శాఖ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.