Telangana News: మొక్కతోనే పట్టా… వ్యవసాయ వర్సిటీ వినూత్న ఆలోచన
ఈ వార్తాకథనం ఏంటి
డిగ్రీ పూర్తయ్యాక పట్టాలు అందుకునే 'గ్రాడ్యుయేషన్ డే' అందరికీ తెలిసినదే. అయితే ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం దీనికి కొత్త అర్థాన్ని జోడించింది. అగ్రి బీఎస్సీ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం 'గ్రీన్ గ్రాడ్యుయేషన్ డే' అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. వర్సిటీ ప్రాంగణంలోని వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న సుమారు 500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కో విద్యార్థి ఒక్కో మొక్కను నాటి, ఆ మొక్కతో ఫొటోలు దిగారు. నాటిన ప్రతి మొక్క వద్ద తమ పేరుతో నేమ్ ప్లేట్ను ఏర్పాటు చేశారు.
వివరాలు
అగ్రి బీఎస్సీ విద్యార్థుల హరిత ప్రమాణం
నాలుగేళ్ల తమ కోర్సు పూర్తయ్యే వరకు విద్యార్థులే స్వయంగా నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను తీసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని తొలుత వైస్ఛాన్సలర్ అల్దాస్ జానయ్య ప్రారంభించి, విద్యార్థులతో హరిత ప్రతిజ్ఞ చేయించారు. కోర్సు పూర్తయ్యాక విద్యార్థులు నాటిన మొక్క పూర్తిగా పెరిగిన దశలో మరోసారి ఫొటో తీసి, ఆ చిత్రాన్ని గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్తో పాటు అందజేస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు, మొదటిసారిగా చేపట్టిన ఈ 'గ్రీన్ గ్రాడ్యుయేషన్ డే' దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలలకు ఆదర్శంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.