Delhi: దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలోని ఆగ్నేయ ప్రాంతం తుగ్లకాబాద్ ఎక్స్టెన్షన్లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బహుళ అంతస్తుల నివాస భవనంలో మంటలు చెలరేగడంతో ఇద్దరు మహిళలు, 22 ఏళ్ల యువకుడు సహా ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
వివరాలు
పార్కింగ్ ప్రాంతంలో మొదలైన మంటలు
ఒఖ్లా ఫైర్ స్టేషన్-1 పరిధిలోని మధ్యమ్ మార్గ్లో ఉన్న నయా తారా అపార్ట్మెంట్ సమీపంలోని గల్లీ నంబర్-1లో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. భవనం గ్రౌండ్ ఫ్లోర్లోని పార్కింగ్ ప్రాంతంలో మంటలు మొదలై వేగంగా వ్యాపించాయి. అక్కడ పార్క్ చేసి ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు మొత్తం ఏడు ద్విచక్ర వాహనాలు మంటల్లో కాలిపోయాయి. దీంతో దట్టమైన పొగ మెట్ల మార్గం గుండా పై అంతస్తులకు వ్యాపించి భవనంలో ఉన్న పలువురు నివాసితులు లోపలే చిక్కుకుపోయారు.
వివరాలు
ఎనిమిది మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
ఉదయం 2.35 నుంచి 2.37 గంటల మధ్య అగ్నిమాపకశాఖకు వరుసగా అత్యవసర కాల్స్ వచ్చాయి. వెంటనే మూడు ఫైర్ టెండర్లు, రెండు నీటి బౌజర్లు, ప్రత్యేక శ్వాస సహాయక యూనిట్,క్విక్ రెస్పాన్స్ వాహనాన్ని ఘటనాస్థలికి పంపించారు. ఇరుకైన వీధిలో భవనం ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురైనా, అగ్నిమాపక సిబ్బంది సాహసోపేతంగా భవనంలో చిక్కుకున్న ఎనిమిదిమందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గాయపడిన వారిని చికిత్స కోసం సఫ్దర్జంగ్ ఆస్పత్రి, ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తరలించారు. ఉదయం 4 గంటలకు పూర్తిగా అదుపులోకి.. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఉదయం 3.45 గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం ఉదయం 4గంటలకల్లా పూర్తిగా ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
వివరాలు
ఢిల్లీ-ఎన్సీఆర్లో వరుస అగ్నిప్రమాదాలు
ఇటీవల ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం దక్షిణ ఢిల్లీలోని ఓ బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం నోయిడాలోని సెక్టార్-49లో మరో అగ్నిప్రమాదం సంభవించగా, పొగతో నిండిన ఫ్లాట్లో చిక్కుకున్న వృద్ధ దంపతులను సురక్షితంగా రక్షించారు. అదే రోజు ఢిల్లీలోని కేదార్ బిల్డింగ్ పీజీ కేంద్రంలో మంటలు చెలరేగినా, అక్కడి విద్యార్థులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు.