Delhi govt: దిల్లీలో అగ్ని ప్రమాదాలపై కఠిన చర్యలు.. చిన్న భవనాలకూ ఫైర్ సేఫ్టీ తప్పనిసరి!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు పెద్ద భవనాలకే పరిమితమైన అగ్నిమాపక భద్రతా నిబంధనలను,తక్కువ ఎత్తు ఉన్న నివాస భవనాలకూ విస్తరించే దిశగా కొత్త ఉపచట్టాలను రూపొందించాలని యోచిస్తోంది. ప్రత్యేకంగా 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న భవనాలు, అపార్ట్మెంట్లు, నివాస సముదాయాల్లో అగ్నిమాపక భద్రతా చర్యలను తప్పనిసరి చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి భవనంలో స్మోక్ డిటెక్టర్లు, అగ్నిప్రమాదాలను అదుపు చేసే పరికరాలు, ఇతర అత్యవసర భద్రతా వ్యవస్థలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఢిల్లీ ఫైర్ సర్వీస్ సిఫార్సు చేసినట్లు తెలిపారు.
వివరాలు
కీలక చర్యలకు శ్రీకారం చుట్టిన ఢిల్లీ ప్రభుత్వం
అంతేకాకుండా, ఇప్పటికే నిర్మాణం పూర్తయిన భవనాల్లోనూ కనీస అగ్నిమాపక భద్రతా పరికరాలను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని సూచించినట్లు సమాచారం. భవిష్యత్తులో అగ్నిప్రమాదాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఇటీవల మాల్వీయ నగర్, వివేక్ విహార్ సహా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకుని అగ్నిమాపక భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఈ కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది.