Delhi High Court: నీట్ రీటెస్టు వేళ టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
నీట్-యూజీ 2026 రీటెస్టు నేపథ్యంలో టెలిగ్రామ్ మెసేజింగ్ ప్లాట్ఫారమ్పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక ఆంక్షలను దిల్లీ హైకోర్టు సమర్థించింది. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు అవసరమైనవేనని,అవి పరిస్థితులకు అనుగుణంగా పరిమిత స్థాయిలో మాత్రమే అమలు చేశాయని జస్టిస్ తేజస్ కరియా శుక్రవారం తీర్పు వెలువరించారు. సమాచార సాంకేతిక చట్టం-2000లోని సెక్షన్ 69ఏ కింద జారీ చేసిన బ్లాకింగ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. "ప్రభుత్వం తీసుకున్న చర్యలు అందుబాటులో ఉన్న వాటిలో అత్యంత తక్కువ పరిమితి కలిగినవే. ఇవి అసమంజసమైనవి లేదా అతిగా ఉన్నాయని చెప్పలేం" అని కోర్టు వ్యాఖ్యానించింది.
వివరాలు
సీబీఐ దర్యాప్తు
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వివాదంలో భాగమైన వ్యవస్థీకృత చీటింగ్ ముఠాలు టెలిగ్రామ్ను వినియోగిస్తున్నాయనే అనుమానాలతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మే 3న నిర్వహించిన అసలు నీట్-యూజీ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ సహా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో పరీక్షను రద్దు చేసి రీటెస్టును నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సిఫార్సుల మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ (మీఇటీవై) జూన్ 22 వరకు భారత్లో టెలిగ్రామ్కు తాత్కాలికంగా యాక్సెస్ను నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే ఇప్పటికే పోస్టు చేసిన సందేశాలను సవరించే 'మెసేజ్ ఎడిట్' సదుపాయాన్ని జూన్ 30 వరకు నిలిపివేయాలని సూచించింది.
వివరాలు
900కు పైగా లింకులను తొలగించామన్న టెలిగ్రామ్
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ టెలిగ్రామ్ హైకోర్టును ఆశ్రయించింది. ఇతర సామాజిక మాధ్యమ వేదికలను కొనసాగించనిచ్చి తమపై మాత్రమే చర్యలు తీసుకోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని కంపెనీ వాదించింది. తాము మే నెల నుంచే ప్రభుత్వ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, కంటెంట్ నియంత్రణ, నిబంధనల అమలుపై పూర్తి వివరాలు సమర్పించామని కోర్టుకు తెలిపింది. జూన్ 9న అధికారులు అందించిన నిర్దిష్ట యూఆర్ఎల్లను గంటలోపే తొలగించామని,నీట్కు సంబంధించిన చట్టవిరుద్ధ కంటెంట్తో ముడిపడిన 900కు పైగా లింకులను ఇప్పటికే తొలగించామని టెలిగ్రామ్ వెల్లడించింది. కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ వ్యవస్థలు, మానవ మోడరేషన్ బృందాల సహాయంతో నిబంధనలకు విరుద్ధమైన కంటెంట్ను గుర్తించి తొలగిస్తున్నామని పేర్కొంది.
వివరాలు
నీట్ వంటి పరీక్ష దేశ సార్వభౌమత్వం,సమగ్రతపై ఎలా ప్రభావం చూపుతుంది?
టెలిగ్రామ్ తరఫున సీనియర్ న్యాయవాది ధ్రువ్ మెహతా వాదనలు వినిపిస్తూ, సెక్షన్ 69ఏ కింద ఉత్తర్వులు జారీ చేసే విషయంలో అధికారులు తగిన ఆలోచన చేయలేదని అన్నారు. "నీట్ వంటి పరీక్ష దేశ సార్వభౌమత్వం,సమగ్రతపై ఎలా ప్రభావం చూపుతుంది?"అని ఆయన ప్రశ్నించారు. తాము ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదింపులు జరుపుతూ, అనుమానాస్పద ఛానళ్లపై ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. మరిన్ని ప్రశ్నపత్రాల లీకేజీలను అడ్డుకుని పరీక్షల విశ్వసనీయతను కాపాడేందుకు అందుబాటులో ఉన్న అత్యంత పరిమిత చర్యనే ప్రభుత్వం తీసుకుందని తెలిపారు.
వివరాలు
కేంద్రం వైఖరికి మద్దతు తెలిపిన అటార్నీ జనరల్
టెలిగ్రామ్ నిర్మాణ విధానం కారణంగా అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతమైన జోక్యం చేసుకోవడం కష్టమని, ఖాతాలు తొలగిస్తే సంబంధిత డేటా, సందేశాలు, మీడియా కూడా మాయమయ్యే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి కూడా కేంద్రం వైఖరికి మద్దతు తెలిపారు. టెలిగ్రామ్ నిర్మాణ తీరును ప్రస్తావిస్తూ, ఇలాంటి పరిస్థితుల్లో దేశం ముందస్తు చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు మరింత క్లిష్టమవుతాయని వాదించారు. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు పూర్తిగా విన్న అనంతరం జూన్ 18న తీర్పును రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు, తాజాగా కేంద్ర ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ టెలిగ్రామ్ పిటిషన్ను కొట్టివేసింది.