దిల్లీలో భారీగా కుంగిన రోడ్డు.. తెల్లవారుజామునే గుర్తించడంతో తప్పిన ప్రాణనష్టం
దేశ రాజధాని దిల్లీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓ రోడ్డు భారీగా కుంగిపోయి రాజధాని వాసులను భయబ్రాంతులకు గురిచేసింది. ఆ రోడ్డు నిత్యం బిజీగా ఉంటుంది. అక్కడ వాహనాల రద్దీ కూడా అధికంగానే ఉంటుంది. అలాంటి రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. నడిరోడ్డుపై బావిలా ఓ పెద్ద గుంత ఏర్పడి కలవరపెడుతోంది. దిల్లీలోని జనక్పురి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు కుంగిపోయింది. వాహనాల రద్దీ ప్రారంభం కాకముందే ఈ ఘటనను గుర్తించగలిగారు. దీంతో భారీ ప్రాణ నష్టం తప్పినట్టైంది. ప్రస్తుతానికి వన్ వేలో మాత్రమే వాహనాలు వెళ్లేందుకు అనుమతి ఉంది. రెండో వైపు గుంతను పూడ్చేందుకు మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.