దిల్లీ మద్యం కుంభకోణం: హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ విచారణలో భాగంగా హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. పాలసీని రూపొందించి అమలు చేస్తున్నప్పుడు ఇతర నిందితులతో జరిగిన సమావేశాల్లో పిళ్లై 'సౌత్ గ్రూప్'కు ప్రాతినిధ్యం వహించారని అధికారులు తెలిపారు.
ఇప్పటికే దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన మనీష్ సిసోడియాను కూడా ఈడీ మంగళవారం తీహార్ జైలులో విచారించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కేసులో సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గత నెలలో అరెస్టు చేసింది. ప్రస్తుతం అతను మార్చి 20వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.
దిల్లీ మద్యం కేసు
సోమవారం పిళ్లైను సుధీర్ఘంగా విచారించిన ఈడీ
కుంభకోణం కేసుకు సంబంధించి పిళ్లైని ఈడీ సోమవారం సుధీర్ఘంగా విచారించింది. ఈ క్రమంలో సాయంత్రం పీఎంఎల్ఏ క్రిమినల్ సెక్షన్ల కింద పిళ్లైని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. అనంతరం కోర్టులో హాజరు పర్చారు. విచారణ కోసం తదుపరి కస్టడీని ఈడీ కోరుతుందని అధికారులు వెల్లడించారు.
సీబీఐ ఎఫ్ఐఆర్లో మొదట అరుణ్ పిళ్లై పేరు ప్రస్తావించగా.. తర్వాత ఈడీ సీన్లోకి ప్రవేశించింది. అనంతరం పిళ్లైని విచారించిన ఈడీ, అతను జూలై 2022లో స్థాపించబడిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సహ-డైరెక్టర్ అని, అది భౌతికంగా లేదని ఈడీ ఆరోపించింది.
అరుణ్తో పాటు అభిషేక్ బోయిన్పల్లి ఎక్సైజ్ అధికారులకు కమీషన్ ఇచ్చేందుకు సమీర్ మహేంద్రుడి నుంచి రూ.3.85 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ ఛార్జ్ష్షీట్లో పేర్కొంది.