
Election Body: ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు.. 45 రోజులకు మించి ఉన్న ఎలక్ట్రానిక్ డేటాను ధ్వంసం చేయండి
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా నిర్వహించే ఎన్నికల సందర్భంగా సేకరించబడే సీసీటీవీ కెమెరాలు,వెబ్కాస్టింగ్, వీడియో ఫుటేజ్ లాంటి ఎలక్ట్రానిక్ డేటా విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఇచ్చిన తాజా మార్గదర్శకాల ప్రకారం,ఓటింగ్ ప్రక్రియ పూర్తైన తర్వాత 45 రోజుల తరువాత వీటిని ధ్వంసం చేయాల్సిందిగా సూచించింది.
ఈసీ ప్రకారం,తమ వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ డేటా కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని తమకు తెలిసిందని,ఇది ఆందోళన కలిగించేదిగా ఉందని పేర్కొంది.
అందుకే ఈ వీడియో ఫుటేజ్లను నిర్ధిష్ట కాలానికే పరిమితం చేయాలని, అనంతరం వాటిని పూర్తిగా తొలగించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
మే 30న ఈ విషయమై రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారులకు ఈసీ లేఖలు పంపించింది.
వివరాలు
నిబంధనల ప్రకారం తప్పనిసరి ప్రక్రియ కాదు
గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘాలకు,ఎన్నికల సమయంలో వివిధ దశల్లో ఫోటోగ్రఫీ,వీడియోగ్రఫీ, సీసీటీవీ, వెబ్కాస్టింగ్ చేయాలన్న సూచనలు ఇచ్చినట్టు ఈసీ గుర్తు చేసింది.
అయితే,ఇది నిబంధనల ప్రకారం తప్పనిసరి ప్రక్రియ కాదని,కానీ ఈ రికార్డింగ్లు కమీషన్కు అంతర్గత విశ్లేషణకు ఉపయోగపడతాయని స్పష్టం చేసింది.
అయితే ఇటీవలి కాలంలో ఎన్నికల్లో పాల్గొనని కొన్ని వ్యక్తులు ఈ డేటాను తప్పుడు సమాచారం ప్రచారానికి వాడుతున్నట్టు ఈసీ గుర్తించిందని పేర్కొంది.
దీనివల్ల సోషల్ మీడియాలో విద్వేషాత్మక ప్రచారం జరుగుతోందని,ప్రజలను దారి తప్పించేదిగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలోనే,సీసీటీవీ, వెబ్కాస్టింగ్,ఫోటోగ్రఫీతో సంబంధం ఉన్న డేటాను కేవలం 45 రోజుల పాటు మాత్రమే భద్రపరచాలని, అనంతరం అది లేకుండా చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
వివరాలు
'ఎలక్షన్ కండక్ట్ రూల్ 93'లో మార్పులు
అయితే, ఎవరైనా వ్యక్తి ఎన్నికల విధానంపై సంబంధిత డేటాను కోరుతూ పిటిషన్ వేస్తే, అలాంటి సందర్భాల్లో మాత్రమే ఆ డేటాను భద్రపరచాలన్న నిబంధనను ఈసీ స్పష్టం చేసింది.
లేకపోతే ఆయా నియోజకవర్గాల డేటాను విధిగా ధ్వంసం చేయాల్సిందేనని తెలిపింది.
ఈ చర్యలు డేటా దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు తీసుకున్నదని ఈసీ స్పష్టం చేసింది.
ఈసీ ప్రతిపాదనల ఆధారంగా కేంద్ర న్యాయశాఖ 'ఎలక్షన్ కండక్ట్ రూల్ 93'లో మార్పులు చేసింది.
ఈ సవరణల ద్వారా పత్రాలు లేదా డాక్యుమెంట్లను ప్రజల్లో విడుదల చేయడంపై నిబంధనలు విధించినట్టు వెల్లడించింది.