mee intiki mee doctor :ఇంటి వద్దకే డాక్టర్ సేవలు.. మొబైల్ యూనిట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి!
ఈ వార్తాకథనం ఏంటి
తిరుపతి జిల్లాలో గ్రామీణ ప్రజలకు వారి ఇంటి వద్దకే వైద్య సేవలు అందించేందుకు 'మీ ఇంటికి మీ డాక్టర్' కార్యక్రమం కింద ప్రత్యేక మొబైల్ వైద్య యూనిట్ను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తిరుపతి ఛైర్మన్ డాక్టర్ డి. శ్రీహరి రావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వి. బాలకృష్ణ నాయక్ల సమక్షంలో ఈ యూనిట్ను ప్రారంభించారు. వెనుకబడిన గ్రామాల్లో ఆరోగ్య సేవలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈ సేవలను అమలు చేస్తోందన్నారు.
వివరాలు
100 మంది రోగులకు ఔట్పేషెంట్ సేవలు
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కాలనీలను లక్ష్యంగా చేసుకుని ఈ మొబైల్ యూనిట్ పనిచేస్తుంది. రోజుకు సుమారు 100 మంది రోగులకు ఔట్పేషెంట్ సేవలు, అవసరమైన మందులు అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మొబైల్ యూనిట్లో ఒక వైద్యుడు, ఒక నర్సు, ఇద్దరు ఫార్మసిస్టులు, ఒక డ్రైవర్ ఉంటారు. వీరు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజూ రెండు నుంచి మూడు గ్రామాలను సందర్శించి సేవలు అందిస్తారు. రోగుల ఫాలోఅప్ కోసం ఆశా (ASHA), ఏఎన్ఎం (ANM) సిబ్బందితో సమన్వయం చేస్తారు. అవసరమైతే రోగులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాంతీయ ఆసుపత్రులు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు.
వివరాలు
రూ.8.40 కోట్ల వ్యయంతో మొబైల్ యూనిట్లు
తిరుపతి సహా మొత్తం ఏడు జిల్లాల్లో రూ.8.40 కోట్ల వ్యయంతో ఇలాంటి మొబైల్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. టీకా కవరేజీని పెంచడం, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణ కూడా ఈ కార్యక్రమం లక్ష్యాలలో భాగమని చెప్పారు. అదనంగా తిరుపతి రెడ్ క్రాస్ కేంద్రంలో ప్లేట్లెట్లు, ప్లాస్మా వేరు చేసే సదుపాయాలతో బ్లడ్ బ్యాంక్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కళాశాలలు, సంస్థల్లో రక్తదానాన్ని ప్రోత్సహించేందుకు త్వరలో మొబైల్ బ్లడ్ బ్యాంక్ను కూడా ప్రవేశపెట్టే ప్రణాళికలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.