E20 petrol: ఈ20 పెట్రోల్తో పాత వాహనాల మైలేజ్ 5% తగ్గొచ్చు: కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
ఈ20 పెట్రోల్ వినియోగంతో ఈ10 ఇంధనానికి అనుగుణంగా తయారైన కొన్ని పాత వాహనాల్లో మైలేజ్ సుమారు 3 నుంచి 5శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ20 ఇంధనం కారణంగా ఇంజిన్లకు పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇథనాల్ మిశ్రమ ఇంధనం వల్ల వాహనాలు నిలిచిపోవడం లేదా ఇంజిన్ దెబ్బతినడం వంటి ఘటనలు నమోదుకాలేదని బుధవారం రాజ్యసభలో వెల్లడించింది. పెట్రోలియం,సహజ వాయు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ లిఖితపూర్వక సమాధానంలో మైలేజ్ అనేది కేవలం ఇంధనంపైనే ఆధారపడదని చెప్పారు. డ్రైవింగ్ విధానం,వాహనం నిర్వహణ,టైర్లలో గాలి ఒత్తిడి,ఏసీ వినియోగం,వీల్ అలైన్మెంట్ వంటి అంశాలు కూడా ఇంధనసామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయని వివరించారు.
వివరాలు
పాత వాహనాల్లో మాత్రమే మైలేజ్ స్వల్పంగా అంటే 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం
ఈ10 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన పాత వాహనాల్లో మాత్రమే మైలేజ్ స్వల్పంగా, అంటే 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అయితే ఈ20 పెట్రోల్కు అధిక ఆక్టేన్ విలువ ఉండటం వల్ల ఇంజిన్లో ఇంధనం మెరుగ్గా దహనమవుతుందని,నాకింగ్ సమస్య తగ్గడంతో పాటు వాహనం మరింత సాఫీగా వేగం అందుకుంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం,ఈ15 పెట్రోల్ గత మూడున్నరేళ్లుగా,ఈ19,ఈ20 ఇంధనం రెండున్నరేళ్లకుపైగా దేశంలో వినియోగంలో ఉన్నాయి.
ఈ కాలంలో ఈ20 ప్రమాణాలు అమల్లోకి రాకముందే తయారైన వాహనాలతో సహా 20కోట్లకుపైగా ద్విచక్ర వాహనాలు,3కోట్లకుపైగా పెట్రోల్ కార్లు ఈ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ,ఇథనాల్ మిశ్రమ ఇంధనం కారణంగా ఇంజిన్లు పెద్దఎత్తున దెబ్బతిన్నాయని నిర్ధారించే ఆధారాలు లేవని తెలిపింది.
వివరాలు
ఈ20 ఇంధనం వల్ల వాహనాలకు నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు లేవు
2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ 2.84 కోట్ల వాహనాలకు సర్వీసింగ్ చేయగా, అందులో 1.5 కోట్ల ఈ20 సర్టిఫికేషన్ లేని పాత వాహనాలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
అయినప్పటికీ ఈ20 ఇంధనం వల్ల వాహనాలకు నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు లేవని పేర్కొంది.
అలాగే ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కూడా ఈ20 ఇంధనం వాడుతున్న వాహనాల్లో గత ఇంధనాలతో పోలిస్తే అదనపు నష్టం కనిపించలేదని తెలిపినట్లు వివరించింది.
ఈ20 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఇంధనాన్ని ఉపయోగిస్తున్న వాహనాలకు తయారీ సంస్థలు వారంటీని యథావిధిగా అమలు చేస్తున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వివరాలు
ఈ0 లేదా ఈ10 పెట్రోల్కు తిరిగి మారే ప్రతిపాదన లేదు: కేంద్రం
ప్రయోగశాల పరీక్షలు, రోడ్లపై నిర్వహించిన ఫీల్డ్ ట్రయల్స్లో డ్రైవింగ్ పనితీరు,స్టార్ట్ అయ్యే సామర్థ్యం,లోహాలు, ప్లాస్టిక్ భాగాల అనుకూలత వంటి అంశాల్లో పాత వాహనాల్లో కూడా ఎలాంటి గణనీయమైన ప్రతికూల మార్పులు కనిపించలేదని తెలిపింది.
దేశంలో ప్రస్తుతం ఈ0 లేదా ఈ10 పెట్రోల్కు తిరిగి మారే ప్రతిపాదన లేదని కేంద్రం స్పష్టం చేసింది.
ఒకేసారి ఈ0, ఈ10, ఈ20 ఇంధనాలను దేశవ్యాప్తంగా లక్షకు పైగా పెట్రోల్ బంకుల్లో సరఫరా చేయడం వల్ల రవాణా, నిల్వ, నిర్వహణ వ్యయాలు భారీగా పెరుగుతాయని పేర్కొంది.
వివరాలు
ఈ అంశాలపై విస్తృతంగా పరీక్షలు
ప్రభుత్వం తెలిపిన ప్రకారం,ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (EBP) కార్యక్రమాన్ని నీతి ఆయోగ్,ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు,ఆటోమొబైల్ తయారీ సంస్థలు,ఏఆర్ఏఐ,సియామ్,ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం తదితర సాంకేతిక సంస్థలతో కలిసి శాస్త్రీయంగా, దశలవారీగా అమలు చేశారు.
ఈ20 ఇంధనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు ఇంజిన్ మన్నిక, తుప్పు నిరోధకత, మెటీరియల్ అనుకూలత, ఉద్గారాలు, ఇంధన సామర్థ్యం, వాహన పనితీరు వంటి అంశాలపై విస్తృతంగా పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు.
వివరాలు
తగ్గిన కార్బన్ ఉద్గారాలు
అలాగే ఏఆర్ఏఐ, సియామ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, వాహన తయారీ సంస్థలు నిర్వహించిన అధ్యయనాల ప్రకారం ఈ20 ఇంధనం వల్ల కార్లలో అసాధారణ స్థాయిలో అరిగిపోవడం లేదా భాగాల అనుకూలత సమస్యలు తలెత్తలేదని ప్రభుత్వం వెల్లడించింది.
పైగా కొన్ని పరీక్షల్లో వాహనాల యాక్సిలరేషన్, రైడ్ క్వాలిటీ మెరుగుపడటంతో పాటు కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గినట్లు గుర్తించినట్లు తెలిపింది.