Earthquake at Bay of Bengal: బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (ఎన్సీఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం, రిక్టర్ స్కేల్పై 4.6 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం ఉదయం 7:43 గంటల 17 సెకన్లకు చోటుచేసుకుంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఎన్సీఎస్ సమాచారం ప్రకారం, భూకంప కేంద్రం 14.027 ఉత్తర అక్షాంశం, 93.132 తూర్పు రేఖాంశం వద్ద బంగాళాఖాతంలో గుర్తించారు. ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎన్సీఎస్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. కాగా,ఈ ఏడాది ఫిబ్రవరి 11న కూడా బంగాళాఖాతంలో రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో భూకంపం నమోదైంది.
వివరాలు
70 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతు భూకంపాలను డీప్-ఫోకస్ భూకంపాలు అంటారు
ఆ సమయంలో ఉదయం 5:12 గంటలకు సంభవించిన ఆ భూకంపం కూడా 10కిలోమీటర్ల లోతులోనే చోటుచేసుకుంది. దాని కేంద్రం 14.94ఉత్తర అక్షాంశం,90.18తూర్పు రేఖాంశం వద్ద ఉన్నట్లు ఎన్సీఎస్ వెల్లడించింది. భూకంపాలు భూమి ఉపరితలం నుంచి సుమారు 700 కిలోమీటర్ల లోతు వరకు ఎక్కడైనా సంభవించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికా భూగర్భ సర్వే (యూఎస్జీఎస్) ప్రకారం,భూకంపాల లోతును మూడు విభాగాలుగా వర్గీకరిస్తారు. 0 నుంచి 70 కిలోమీటర్ల లోతులో సంభవించేవి అల్ప లోతు(షాలో)భూకంపాలు,70 నుంచి 300 కిలోమీటర్ల మధ్య సంభవించేవి మధ్యస్థ లోతు భూకంపాలు, 300 నుంచి 700 కిలోమీటర్ల లోతులో నమోదయ్యేవి లోతైన భూకంపాలుగా పరిగణిస్తారు. సాధారణంగా 70 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతులో సంభవించే భూకంపాలను డీప్-ఫోకస్ భూకంపాలు అని వ్యవహరిస్తారు.