Etela Rajender: హస్తం గూటికి ఈటల అంటూ ప్రచారం.. కానీ ఆయన ఏమన్నారంటే
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కొద్దిరోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికల వేడి మొడలవనుంది. ఈ మేరకు రాష్ట్రంలో మరోసారి ఎన్నికల రగడ ఊపందుకోనుంది. ఈ క్రమంలోనే బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజకీయ భవితవ్యంపై ప్రచారం జరుగుతోంది. ఆయన పార్టీ మారతారని, అధికార కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని అంటున్నారు. అయితే దీనిపై స్పందించిన ఈటల, అదంతా వట్టిదేనన్నారు. ఇలాంటి పుకార్లు అన్నీ కాంగ్రెస్ నేతలే పుట్టిస్తున్నారని, లేకుంటే బీజేపీ నుంచి నన్ను వెళ్లగొట్టేందుకు కమలం నేతలు కూడా ప్లానే చేస్తుండొచ్చని వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో రానున్న లోక్ సభ ఎన్నికల బరిలో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి తాను బరిలో నిలవనున్నట్లు చెప్పారు.
ఓడిన బడా నేతల్లో ఈటల కూడా ఉన్నారు
తాను గజ్వేల్లో ఓడిపోయినా, తిరిగి లోక్సభ ఎన్నికల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఈటల తాజా వ్యాఖ్యలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు ఆయనకు బీజేపీ పెద్దలతో ఎలాంటి విబేధాలూ లేవని అర్థమవుతోంది. అందుకే ఆయనకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, హైకమాండ్ పెద్దల్ని ఆయన్ని మల్కాజ్గిరి స్థానం నుంచి బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన బడా నేతలు ఓటమిపాలయ్యారు.ఈ జాబితాలో ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. ఈటల మాజీ సీఎం కేసీఆర్'పై గజ్వేల్ లో పోటీ చేసి ఓడిపోయారు.తన సొంత నియోజకవర్గం హుజురాబాద్ నుంచి కూడా గెలవలేకపోయారు. అయితే గజ్వేల్ కాకుండా మరో స్థానం నుంచి పోటీ చేసి ఉంటే, ఆన గెలిచేవారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.