Nouheera Shaik: రూ.10 వేల కోట్ల మోసం కేసులో హీరాగోల్డ్ అధినేత నౌహీరా షేక్ అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.10 వేల కోట్లు సేకరించి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న హీరాగోల్డ్ సంస్థ అధినేత నౌహీరా షేక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. నకిలీ పత్రాలు తయారు చేసుకుని హరియాణాలో తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో ఈడీ అధికారులు హర్యానా పోలీసులతో కలిసి ప్రత్యేక చర్యలు చేపట్టారు. సంయుక్త దాడుల్లో భాగంగా గురువారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం శుక్రవారం హైదరాబాద్కు తరలించారు. కోర్టులో ఆమెను హాజరుపరచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
వివరాలు
సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఇదిలా ఉండగా, ఈ కేసులో నౌహీరా షేక్కు ఇటీవల సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ వేలం ద్వారా అమ్మిన ఆస్తులను కొనుగోలు చేసిన వారి పేర్లపై నమోదు చేయించేందుకు ఆమె సహకరించకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆమెను జైలులోనే ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే వారం రోజుల్లో సంబంధిత జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని స్పష్టం చేసింది. అయితే అప్పటి నుంచి పరారీలో ఉన్న నౌహీరా షేక్ను తాజాగా ఈడీ అధికారులు పట్టుకున్నారు.