LOADING...
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కామ్‌లో ఈడీ దూకుడు.. భారీ అక్రమాలు బట్టబయలు!
ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కామ్‌లో ఈడీ దూకుడు.. భారీ అక్రమాలు బట్టబయలు!

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కామ్‌లో ఈడీ దూకుడు.. భారీ అక్రమాలు బట్టబయలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 13, 2026
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. మనీలాండరింగ్ కోణంలో కొనసాగుతున్న విచారణలో భాగంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈడీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, జూన్‌ 11, 2026న మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి, విజయ నరసింహ రెడ్డి, వల్లు సందీప్, కరుమూరి నాగేశ్వరరావు, కరుమూరి సునీల్ కుమార్‌ల నివాసాలు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించింది.

వివరాలు

ఆస్తి పత్రాలు స్వాధీనం

సోదాల సందర్భంగా ఒక లగ్జరీ కారుతో పాటు సుమారు రూ.94.5 లక్షల విలువైన ఖరీదైన చేతి గడియారాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. అదనంగా భారీ మొత్తంలో లెక్కల్లో చూపని నగదు, అనుమానాస్పద జాయింట్ వెంచర్ ఒప్పందాలకు సంబంధించిన పత్రాలు, నగదు లావాదేవీల రికార్డులు, ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. దర్యాప్తులో కీలక పురోగతిగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం వారిని నాంపల్లి ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపర్చగా, కోర్టు జూన్‌ 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

వివరాలు

టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు

ఈడీ దర్యాప్తు ప్రకారం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) లిక్కర్ రవాణా టెండర్ల నిబంధనలను కొందరికి అనుకూలంగా మార్చినట్లు గుర్తించింది. సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్‌, ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్స్ సంస్థలను ఫ్రంట్ కంపెనీలుగా ఉపయోగించినట్లు విచారణలో తేలినట్లు వెల్లడించింది. లిక్కర్ రవాణా వ్యవహారానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలన్నీ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి వర్గం ఆధీనంలోనే ఉన్నట్లు ఈడీ పేర్కొంది. అధిక రేట్లకు టెండర్లు దక్కించుకుని అక్రమ లాభాలు పొందినట్లు దర్యాప్తులో బయటపడిందని తెలిపింది. ఈ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ప్రధాన కుట్రదారుడిగా గుర్తించినట్లు వెల్లడించింది.

Advertisement

వివరాలు

కీలక సూత్రధారిగా దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి

మాజీ ఐటీ సలహాదారుగా తన రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి టెండర్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ ఆరోపించింది. జిల్లా స్థాయిలో కార్టన్‌కు సగటున రూ.19.68గా ఉన్న రవాణా రేట్లను రూ.35.57 వరకు పెంచి భారీ లాభాలు ఆర్జించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపింది. అంతేకాకుండా స్థానిక రాజకీయ నాయకులు, అనుబంధ వ్యక్తులు, సంస్థలకు సబ్ కాంట్రాక్టులు కేటాయించే సమాంతర వ్యవస్థను నిర్వహించినట్లు విచారణలో తేలినట్లు పేర్కొంది. అప్పటి APSBCL మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు ఈడీ ఆరోపించింది.

Advertisement

వివరాలు

ప్రభుత్వానికి రూ.195.33 కోట్ల నష్టం

చట్టబద్ధంగా అమలులో ఉన్న జిల్లా స్థాయి రవాణా విధానాన్ని రద్దు చేసి, ప్రభుత్వ అనుమతి లేకుండానే రాష్ట్రవ్యాప్త కేంద్రీకృత రవాణా విధానాన్ని అమలు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే నివేదికలు సమర్పించడం, తగిన అనుమతులు లేకుండానే కాంట్రాక్టులకు పలుమార్లు గడువు పొడిగింపులు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుమారు రూ.195.33 కోట్ల మేర నష్టం జరిగినట్లు ఈడీ అంచనా వేసింది. కేసులో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు మరింత వేగంగా కొనసాగుతోందని, రానున్న రోజుల్లో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఈడీ వెల్లడించింది.

Advertisement