El Nino: ఖరీఫ్కు ఎల్నినో ముప్పు.. 12 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్పై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్నినో ప్రభావానికి గురయ్యే 12 రాష్ట్రాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్-2026 సన్నద్ధతపై మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పరిస్థితిని పరిశీలించారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా సంబంధిత రాష్ట్రాల జిల్లా యంత్రాంగం, వ్యవసాయ శాఖలు, కృషి విజ్ఞాన్ కేంద్రాలు (కేవీకేలు)తో పాటు ఇతర అనుబంధ సంస్థల మధ్య సమన్వయం పెంచుతూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. రైతులకు అవసరమైన సూచనలు, ముందస్తు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
వివరాలు
ఖరీఫ్ పంటలపై ప్రభావం
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, బిహార్, ఝార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో ఖరీఫ్ పంటలపై ప్రభావం పడే పరిస్థితులు ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ శాఖలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.