LOADING...
Election Commission of India: భారత ఎన్నికల సంఘం సంచలనం.. 334 రాజకీయ పార్టీలపై వేటు 
భారత ఎన్నికల సంఘం సంచలనం.. 334 రాజకీయ పార్టీలపై వేటు

Election Commission of India: భారత ఎన్నికల సంఘం సంచలనం.. 334 రాజకీయ పార్టీలపై వేటు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 09, 2025
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ)ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. గత ఆరు సంవత్సరాలుగా కనీసం ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయని,క్రియారహితంగా ఉన్న 334 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్లు శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కేవలం పత్రాలపై మాత్రమే ఉన్న ఈ పార్టీలను జాబితా నుంచి తొలగించడం ద్వారా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంచడమే తమ లక్ష్యమని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, రిజిస్టర్ అయిన ప్రతి రాజకీయ పార్టీ,నిర్దిష్ట కాల వ్యవధిలో క్రమం తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేయాలి. అయితే 2019 నుంచి ఇప్పటివరకు ఈ 334 పార్టీలు ఏ ఒక్క ఎన్నికలోనూ తమ అభ్యర్థులను నిలబెట్టలేదు.

వివరాలు 

తాజా చర్యతో 2,520కి తగ్గిన గుర్తింపు లేని పార్టీల సంఖ్య 

అంతేకాకుండా, రిజిస్ట్రేషన్ సమయంలో అందజేసిన చిరునామాల వద్ద వీటి కార్యాలయాలు లేవని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందని ఈసీ తెలిపింది. ఈ రెండు కీలక ప్రమాణాలను పాటించడంలో విఫలమైనందున, వాటి రిజిస్ట్రేషన్ రద్దు చేయాల్సి వచ్చిందని స్పష్టంచేసింది. ఈ చర్యకు ముందు దేశవ్యాప్తంగా మొత్తం 2,854 గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీలు ఉండగా,తాజా నిర్ణయంతో 334 పార్టీలను జాబితా నుంచి తొలగించారు. దాంతో ప్రస్తుతం గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీల సంఖ్య 2,520కి తగ్గింది. ఈ చర్య దేశంలోని పలు రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన పార్టీలకు వర్తిస్తుంది.

వివరాలు 

దేశంలో 6 జాతీయ, 67 రాష్ట్ర పార్టీలు ఉన్నాయని వెల్లడి 

అయితే, ఈ నిర్ణయం కేవలం గుర్తింపు లేని, క్రియారహిత పార్టీలకే పరిమితమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో చురుకుగా ఉన్న 6 జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర స్థాయి పార్టీల కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని వివరించింది. ఎన్నికల వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రక్షాళన చర్యలు కొనసాగుతాయని ఈసీ వర్గాలు వెల్లడించాయి.