
Amaravati: అమరావతి కొత్త రైల్వే లైన్.. కీలక నగరాలతో అనుసంధానం
ఈ వార్తాకథనం ఏంటి
అమరావతి మీదుగా రైల్వే మార్గం నిర్మాణానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎర్రుపాలెం నుండి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కి.మీ. పొడవు ఉన్న రైల్వే లైన్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్ట్ పనులు త్వరలోనే వేగంగా ప్రారంభం కానున్నాయి. రైల్వే శాఖ జూన్ నెలలో ఈ ప్రాజెక్ట్కు సంబంధించి గెజిట్ విడుదల చేసి, దీనిని ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించింది.
ప్రస్తుతం కేంద్రం ఆమోదంతో, భూసేకరణ కూడా ప్రారంభమైంది. టెండర్లు పిలిచి, నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
రైల్వే బోర్డు ఇప్పటికే డీపీఆర్ (వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక) కు ఆమోదం తెలిపింది.
వివరాలు
భూసేకరణ ప్రక్రియ
ఈ ప్రాజెక్ట్లో, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఖమ్మం జిల్లాల పరిధిలో మొత్తం 450 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు.
భూసేకరణకు సంబంధించిన చర్యలు వేగంగా జరగనుండగా, రైల్వే మార్గం కోసం అవసరమైన సర్వేలు కూడా పూర్తయ్యాయి.
కాజీపేట-విజయవాడ మార్గంలో కొత్త స్టేషన్లు
కాజీపేట-విజయవాడ ప్రధాన మార్గంలో ఎర్రుపాలెం వద్ద ప్రారంభమయ్యే ఈ కొత్త లైన్, విజయవాడ-గుంటూరు మార్గంలో నంబూరు వద్ద కలుస్తుంది.
ఈ లైన్లో మొత్తం 9 కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు: పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరు.
ఇందులో అమరావతి, పెద్దాపురం, కొప్పురావూరు స్టేషన్లను పెద్దగా అభివృద్ధి చేయనున్నారు.
ఇక పరిటాల వద్ద ఎక్కువగా గూడ్స్ రైళ్ల నిల్వల కోసం ప్రత్యేకమైన సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.
వివరాలు
కృష్ణా నదిపై వంతెన నిర్మాణం
కొత్తపేట-వడ్డమాను మధ్యలో కృష్ణా నదిపై 3.2 కి.మీ. పొడవు ఉన్న వంతెన నిర్మించనున్నారు. ఈ వంతెన రైల్వే మార్గానికి కీలకంగా ఉండనుంది.
సింగిల్ లైన్ వల్ల నిరాశ
కేంద్రం ఆమోదం ఇచ్చినప్పటికీ, డబుల్ లైన్కు బదులుగా సింగిల్ లైన్ మాత్రమే నిర్మిస్తుండడంతో కొంత నిరాశ వ్యక్తమవుతోంది.
రాజధాని అమరావతికి దక్షిణం నుంచి, ఉత్తరభాగం నుండి మరింత సులభంగా రైళ్లు చేరే విధంగా లింక్లైన్లకు సంబంధించి అనేక ప్రతిపాదనలు ముందుకు వచ్చినప్పటికీ, వాటిని ఆమోదించకపోవడం వల్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది.
వివరాలు
ప్రాజెక్ట్ వెనుకబాటు
ఈ ప్రాజెక్ట్ 2017-18లో మంజూరైంది. ఈ లైన్ కోసం మొదట డబుల్ లైన్ ప్రతిపాదించారు. కానీ ఎర్రుపాలెం-నంబూరు మధ్య 57 కి.మీ. సింగిల్ లైన్కు మాత్రమే క్లియరెన్స్ ఇచ్చారు.
గతంలో సికింద్రాబాద్ నుంచి నేరుగా అమరావతికి చేరే లింక్ లైన్ నిర్మాణం ప్రతిపాదనలో ఉంది.
కానీ ఇప్పుడు ఆ లింక్ లైన్కు ఆమోదం రాకపోవడంతో, సికింద్రాబాద్ నుంచి గుంటూరు వరకు వెళ్లి, ఆపై రోడ్డు మార్గంలో రాజధానికి చేరుకోవాల్సి వస్తోంది.
వివరాలు
రైల్వే ప్రాజెక్టుకు పునర్వ్యవస్థ
రాజధాని అమరావతి మీదుగా ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ప్రయాణించే రైళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
అమరావతి రైల్వే మార్గం పూర్తయితే, ఉత్తరాది నుండి దక్షిణాది రాష్ట్రాలకు ప్రయాణం మరింత సులభమవుతుంది.
అమరావతితో హైదరాబాద్, సికింద్రాబాద్, ముంబయి, నాగ్పూర్ వంటి నగరాలు అనుసంధానమవుతాయి.
అంతేకాకుండా దక్షిణభాగంలో చెన్నై, తమిళనాడు, కేరళ ప్రాంతాలకు కూడా రైళ్లు అమరావతిలోంచి ప్రయాణం చేస్తాయి.
విజయవాడ రైల్వే స్టేషన్పై ఒత్తిడి తగ్గింపు
ప్రస్తుతం విజయవాడ మీదుగా రోజూ 250కి పైగా రైళ్లు ప్రయాణిస్తుండటంతో, ఈ స్టేషన్పై తీవ్రమైన ఒత్తిడి ఉంది. అమరావతి లైన్ ప్రారంభం అయితే, ఆ ఒత్తిడిని తగ్గించేందుకు వీలవుతుంది.
వివరాలు
ఐదేళ్లు తొక్కిపెట్టిన జగన్ ప్రభుత్వం
జగన్ సర్కారు ఐదేళ్లపాటు అమరావతి ప్రాజెక్టును పూర్తిగా అడ్డుకోవడంతో ఈ ప్రాజెక్ట్లో పెద్దగా పురోగతి కనిపించలేదు.
రైల్వే శాఖ కూడా ప్రతియేటా రూ.1000 మాత్రమే కేటాయిస్తూ వస్తోంది. కానీ, ఈ ఏడాది చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా వచ్చాక, ప్రాజెక్టుకు కొత్త ఊపిరి వచ్చింది.
రైల్వే శాఖ ప్రాజెక్ట్కు సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేసి, కేంద్రం ఆమోదం తెలపడంతో, పనులు వేగంగా ప్రారంభమవుతాయి.