EPFO: ఈపీఎఫ్ఓ అప్డేట్స్.. పీఎఫ్ సభ్యులకు కీలక మార్పులు, కొత్త నిబంధనలు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) గత కొన్ని నెలల్లో పలు కీలక మార్పులను ప్రవేశపెట్టింది. 2025 ఆదాయపు పన్ను చట్టం అమలుతో పాటు వచ్చిన ఈ మార్పులు, ప్రావిడెంట్ ఫండ్ సభ్యులకు సేవలను సులభతరం చేయడం, కంప్లయెన్స్ ప్రక్రియను సరళీకరించడం లక్ష్యంగా తీసుకొచ్చినవి. ఈ మార్పుల్లో ముఖ్యమైనది.. ఫారమ్ 15G, 15Hలను రద్దు చేసి, వాటి స్థానంలో ఏప్రిల్ 1 నుంచి ఒకే ఫారమ్ 121ను ప్రవేశపెట్టడం. దీని ద్వారా EPF ఉపసంహరణలు, వడ్డీపై TDS మినహాయింపు పొందడం మరింత సులభమవుతుంది. అదనంగా, పాత లేదా నిలిచిపోయిన PF ఖాతాలను గుర్తించి లింక్ చేసుకునేందుకు EPFO కొత్త పోర్టల్ను కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
వివరాలు
ఫారమ్ 15G, 15Hలకు బదులుగా ఫారమ్ 121
ఇక కొంతమంది మీడియా నివేదికల ప్రకారం, ప్రస్తుతం నెలకు రూ.1,000గా ఉన్న ఈపీఎస్ (EPS-95) కనీస పెన్షన్ను పెంచే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, లక్షలాది పెన్షనర్లకు ప్రయోజనం కలగొచ్చు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. EPFO, 2025 ఆదాయపు పన్ను చట్టం కింద కొత్త కంప్లయెన్స్ విధానాన్ని అమలు చేసింది. దీంట్లో భాగంగా, ఇంతకాలంగా వినియోగంలో ఉన్న ఫారమ్ 15G, 15Hలను తొలగించి, వాటి స్థానంలో ఒకే ఫారమ్ 121ను తీసుకొచ్చింది. ఈ మార్పు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు EPFO ఏప్రిల్ 13న సర్క్యులర్ జారీ చేసింది.
వివరాలు
ఆ రెండింటి స్థానంలో ఒకే ఫారమ్ 121
కొత్త విధానంలో, ఫారమ్ 121ను ఒక యూనిఫైడ్ సెల్ఫ్-డిక్లరేషన్ ఫారమ్గా ప్రవేశపెట్టారు. ఇంతకుముందు వయస్సు ఆధారంగా వేర్వేరు ఫారమ్లు ఉండేవి. 60 ఏళ్లలోపు వారికి ఫారమ్ 15G, సీనియర్ సిటిజన్లకు ఫారమ్ 15H వాడాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ రెండింటి స్థానంలో ఒకే ఫారమ్ 121తో ప్రక్రియను సులభతరం చేశారు. ఫారమ్ 121 ద్వారా అర్హత కలిగిన పన్ను చెల్లింపుదారులు EPF ఉపసంహరణలు, వడ్డీ, డివిడెండ్లపై TDS మినహాయింపు కోరవచ్చు. ఈ ఫారమ్ సమర్పించినప్పుడు, తమ మొత్తం వార్షిక ఆదాయం పన్ను పరిధికి లోబడదని వారు ప్రకటించాలి.
వివరాలు
పాత PF ఖాతాల కోసం E-PRAAPTI పోర్టల్
డిజిటల్ సేవలను విస్తరించడంలో భాగంగా EPFO మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాత లేదా ఉపయోగంలో లేని PF ఖాతాలను గుర్తించి మళ్లీ యాక్టివ్ చేసుకునేందుకు E-PRAAPTI అనే డిజిటల్ పోర్టల్ను ప్రారంభించేందుకు యోచిస్తోంది. ఈ విషయాన్ని కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. E-PRAAPTI (EPF Aadhaar-Based Access Portal for Tracking Inoperative Accounts) ద్వారా, సభ్యులు ఆధార్ ఆధారిత ధృవీకరణతో తమ పాత ఖాతాలను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ఖాతాలు UANతో లింక్ కాకపోయినా కూడా వినియోగించుకోవచ్చు. అలాగే, ప్రొఫైల్ అప్డేట్ చేయడం, UAN సీడింగ్ ప్రక్రియలను కూడా ఉద్యోగదాత జోక్యం లేకుండా పూర్తి చేసుకునే వీలుంటుంది.