Andhra Pradesh: వెలిగొండ నిర్వాసితులకు నిత్యావసరాల కిట్.. ఒక్కో కుటుంబానికి రూ.2,818 విలువైన సరుకులు
ఈ వార్తాకథనం ఏంటి
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు మరింత సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.4.07 కోట్ల నిధులను మంజూరు చేస్తూ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి రూ.2,818 విలువైన నిత్యావసరాల కిట్ను అందించనున్నారు. ఈ కిట్లో 25 కిలోల బియ్యం, కిలో పప్పు, కిలో చక్కెర, లీటరు వంట నూనె, రెండు కిలోల ఉల్లిపాయలు, రెండు కిలోల బంగాళాదుంపలు ఉంటాయి. దాదాపు 10 వేల మందికి ఈ కిట్లను అందించేందుకు రూ.2.81 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
వివరాలు
4,933 పశువులకు 30 రోజుల పాటు దాణా
వెలిగొండ ప్రాజెక్టు కింద ముంపునకు గురైన గ్రామాల్లోని 4,933 పశువులకు 30 రోజుల పాటు ఉచితంగా దాణా అందిస్తున్నారు.
ఇందుకోసం 295.98 మెట్రిక్ టన్నుల దాణా అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. దాణా కోసం రూ.65.80 లక్షలను కేటాయించారు.
వివరాలు
ఆరు వేల మంది మహిళలకు ప్రత్యేక కిట్లు
నిర్వాసిత గ్రామాల్లోని 6,000 మంది మహిళలకు చీర, గాజులు, పసుపు, కుంకుమతో కూడిన ప్రత్యేక కిట్లను అందించనున్నారు.
వీటి కోసం ప్రభుత్వం రూ.60 లక్షలు కేటాయించింది. ఇప్పటికే 6,000 మందికి సరిపడా కిట్లు మార్కాపురం ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఈ కిట్లపై 'వెలిగొండ ప్రాజెక్టు త్యాగమూర్తులైన అక్క-చెల్లెమ్మలకు చంద్రన్న రాఖీ కానుక' అని ముద్రించారు.