Bengaluru: బెంగళూరులో నకిలీ క్యాన్సర్ మందుల దందా.. రూ.5 కోట్ల విలువైన ఔషధాలు స్వాధీనం
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరు నగరంలో నకిలీ క్యాన్సర్ మందుల విక్రయ దందాను పోలీసులు ఛేదించారు. బెంగళూరు పోలీసులు, డ్రగ్ కంట్రోల్ విభాగం సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మినర్వా సర్కిల్ సమీపంలోని 'కృపా హెల్త్కేర్' ఫార్మసీ యజమాని వీరేష్ కుమార్ జైన్ను పోలీసులు అరెస్టు చేశారు. 90కి పైగా ఆసుపత్రులు, క్లినిక్లకు సరఫరా వీరేష్ కుమార్ జైన్ నగరంలోని 90కి పైగా ఆసుపత్రులు, క్లినిక్లు, మెడికల్ షాపులకు నకిలీ, రీప్యాకేజ్ చేసిన మందులను సరఫరా చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ఔషధాలతో పాటు ప్రాణరక్షక మందులు, ఐసీయూ ఇంజెక్షన్లను కూడా విక్రయించినట్లు పోలీసులు తెలిపారు.
వివరాలు
బ్రాండ్ పేర్లు మార్చి.. గడువు ముగిసిన మందులకు కొత్త ప్యాకెట్లు
వీటిని మార్కెట్ ధర కంటే దాదాపు 50 శాతం తక్కువకు ఆసుపత్రులు, క్లినిక్లు, మెడికల్ షాపులకు విక్రయించినట్లు వెల్లడించారు.
తక్కువ ధరలకు మందులను కొనుగోలు చేసి, వాటి బ్రాండ్ పేర్లు మార్చి వివిధ పేర్లతో విక్రయించడం ఈ ముఠా పద్ధతిగా పోలీసులు గుర్తించారు.
గడువు ముగిసిన మందులను కొత్త ప్యాకెట్లలోకి మార్చినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.
ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల లేబుళ్లను పోలిన నకిలీ లేబుళ్లను ఉపయోగించి వాటిని మార్కెట్ చేసినట్లు వెల్లడించారు.
ఈ అక్రమ దందాలో సుమారు 15 మంది పాల్గొన్నట్లు సమాచారం.
వివరాలు
ఫామ్హౌస్లో రూ.5 కోట్ల మందులు స్వాధీనం
ఆగస్టు 18న దక్షిణ బెంగళూరులోని బిడది, దోదేరి ప్రాంతాల్లో ఉన్న ఓ ఫామ్హౌస్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో సుమారు రూ.5 కోట్ల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ బిల్లులు, ఇంజెక్షన్ డ్రగ్ ఫిల్లింగ్ పరికరాలు, నకిలీ లేబుళ్లను కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం ఈ వ్యవహారంపై దర్యాప్తును ముమ్మరం చేశారు.
పలు రాష్ట్రాల్లో సిట్ సోదాలు
ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కర్ణాటకతో పాటు హర్యానా, హిమాచల్ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రల్లోని 10కి పైగా ప్రాంతాల్లో సమన్వయంతో సోదాలు నిర్వహించింది.
నకిలీ మందుల దందాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఇందులో పాల్గొన్న ఇతర వ్యక్తుల వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.