పవన్ వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై సీరియస్ యాక్షన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భార్య అన్నా లెజ్నెవా విడిపోయారంటూ ఇటీవల జోరుగా వార్తలు వినిపించాయి. దీనిపై జనసేన పార్టీ సీరియస్ అయింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై తప్పుడు కథనాలు, అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ వెల్లడించింది. అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, వారి అనుబంధ యూట్యూబ్ ఛానెల్స్, పలు మీడియా సంస్థలపై జనసేన పార్టీ చర్యలకు సిద్ధమైంది. వైసీపీకి చెందిన పన్నెండు ట్విట్టర్ అకౌంట్ల వివరాలను కూడా జనసేన ప్రకటించడం గమనార్హం.
క్షమాపణ చెప్పకపోతే కేసు నమోదు
జనసేన కార్యకర్తల్లో పవన్ కళ్యాణ్ గురించి తప్పుడు ప్రచారం చేసి, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతియాలన్న కుట్రతోనే ఇలాంటి పోస్టులు ఉద్ధేశపూర్వకంగా సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారని జనసేన ఆరోపించింది. ఇది కచ్చితంగా కొంతమంది వ్యక్తుల కుట్రపూరితంగా చేసిన పన్మాగమేనని, రాజకీయ పరమైన ప్రయోజనాలు పొందడానికే ఇలాంటి పనులను చేస్తున్నారని జనసేన స్పష్టం చేసింది. క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం, క్రిమినల్ కుట్ర వంటి నేరాల కేసులు నమోదు చేస్తామని తెలిపింది. ఈ మేరకు వైసీపీకి చెందిన కొన్ని అసభ్యకర ఖాతాల వివరాలు అంటూ జనసేన పార్టీ ఓ జాబితాను విడుదల చేసింది. ఇందులో కొన్ని మీడియా సంస్థలున్నాయి.