Page Loader
Punjab Farmers: శంబు సరిహద్దు వద్ద పంజాబ్ రైతులపై అణిచివేత.. దేశవ్యాప్తంగా నిరసనకు రైతు సంఘాల పిలుపు 
శంబు సరిహద్దు వద్ద పంజాబ్ రైతులపై అణిచివేత.. దేశవ్యాప్తంగా నిరసనకు రైతు సంఘాల పిలుపు

Punjab Farmers: శంబు సరిహద్దు వద్ద పంజాబ్ రైతులపై అణిచివేత.. దేశవ్యాప్తంగా నిరసనకు రైతు సంఘాల పిలుపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2025
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

శంభూ,ఖనౌరీ సరిహద్దు ప్రాంతాల్లో రైతులు ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలను పంజాబ్ పోలీసులు బుధవారం బలవంతంగా తొలగించారు. ఈ పరిణామానికి స్పందనగా రైతు సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించాయి. సంయుక్త్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా వంటి సంఘాలు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నారు. పంజాబ్‌లో కొందరు రైతులు రాష్ట్రవ్యాప్తంగా చెక్కా జామ్‌కి పిలుపునిచ్చారు.

వివరాలు 

రైతు నేతల హౌస్ అరెస్టు

రైతు నాయకులు జగ్జీత్ సింగ్ దల్లేవాల్, సర్వన్ సింగ్ పందేర్ సహా ఇతరుల అరెస్టును రైతు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. పంజాబ్‌లోని గ్రామాల సమీపంలోని రోడ్లను రైతులు బ్లాక్ చేస్తున్నారు. అనేక మంది రైతు నేతలను హౌస్ అరెస్టు చేశారు. ఈ అరెస్టులను నిరసిస్తూ పంజాబీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నేతలు అమరిందర్ సింగ్ రాజా, గుర్జిత్ ఔజ్లా, అమర్ సింగ్ డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న రైతులు నిరాహార దీక్షకు దిగారు. సంగ్రూర్, పాటియాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

వివరాలు 

 హైవేపై ధర్నా చేస్తున్న రైతులను చెదరగొట్టిన పోలీసులు 

జగ్జీత్ సింగ్ దల్లేవాల్‌ను జలంధర్ కంటోన్మెంట్‌కు తరలించారు. శంభూ బోర్డర్‌ను పంజాబ్ వైపు నుంచి క్లియర్ చేశారు. చండీఘడ్ హైవేపై ధర్నా చేస్తున్న రైతులను పోలీసులు చెదరగొట్టారు. గత ఏడాది ఫిబ్రవరి 13న రైతులు ఖనౌరీ, శంభూ సరిహద్దుల్లో నిరసనలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. రైతుల శిబిరాలను తొలగించేందుకు పోలీసులు బలప్రయోగం చేశారు. అక్కడున్న రైతులను అక్కడి నుంచి తరిమివేసి, గుడారాలను కూల్చివేశారు. శంభూ, ఖనౌరీ సరిహద్దులకు వెళుతున్న రైతు నాయకులు జగ్జీత్ సింగ్ దల్లేవాల్, సర్వన్ సింగ్ పందేర్‌తో పాటు 200 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొహాలీ వద్ద దల్లేవాల్, పందేర్‌ను, ఖనౌరీ సరిహద్దు వద్ద మరో 200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు 

సరిహద్దు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం

ఈ రెండు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంబులెన్సులు, బస్సులు, అగ్నిమాపక వాహనాలను అక్కడే నిలిపారు. ఖనౌరీ వద్ద సుమారు 3,000 మంది పోలీసులను మోహరించారు. శంభూ సరిహద్దుకు మరో బలగాన్ని తరలించారు. రైతులు తమ టెంట్లను ఖాళీ చేయాలని వారికి 10 నిమిషాల గడువు ఇచ్చారు.