LOADING...
Andhra news: వాహనమిత్ర పథకంతో 2.90 లక్షల మంది డ్రైవర్లకు ఆర్థిక సహాయం
వాహనమిత్ర పథకంతో 2.90 లక్షల మంది డ్రైవర్లకు ఆర్థిక సహాయం

Andhra news: వాహనమిత్ర పథకంతో 2.90 లక్షల మంది డ్రైవర్లకు ఆర్థిక సహాయం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2025
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆటో డ్రైవర్లను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాహనమిత్ర పథకం కింద ప్రతి డ్రైవర్‌కు రూ.15,000 వరకు ఆర్థికసాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.90 లక్షల మంది డ్రైవర్లకు ఆర్థికసాయం అందనుంది. మొత్తంగా వారు రూ.435 కోట్ల మేర లబ్ధి పొందనున్నారు.ఆగస్టు 15 నుండి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే స్త్రీశక్తి పథకాన్ని అమలు చేయగా అది ప్రారంభించిన సమయంలోనే ఆటో డ్రైవర్లకు ఆర్థికసాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. ఆటో డ్రైవర్లు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. అలాగే, ఈ దసరా పండుగ వేళ వాహనమిత్ర పథకం కింద డ్రైవర్లకు సహాయం చేయడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వివరాలు 

పథకం ఎవరికి వర్తిస్తుందంటే.. 

గతంలో గత ప్రభుత్వం ఈ పథకం ద్వారా డ్రైవర్లకు రూ.10,000 చొప్పున మాత్రమే సహాయం అందజేసినప్పటికీ, కొత్త కూటమి ప్రభుత్వం రూ.15,000 చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. సొంత వాహనం కలిగి, దాన్ని స్వయంగా నడిపిస్తూ జీవనం సాగిస్తున్న డ్రైవర్లకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) సుమారు 2.75 లక్షల మంది అర్హులు ఉన్నారు. వీరిలో.. ఆటో డ్రైవర్లు- 2.5 లక్షల మంది. ట్యాక్సీ, మ్యాక్సీక్యాబ్ డ్రైవర్లు-25,000 మంది.తాజాగా వీరి సంఖ్య మరో 15వేల వరకు పెరిగి ఉంటుందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈసారి 2.90 లక్షల మందికి సాయం అందుతుందని భావిస్తున్నారు. అందువల్ల ఈసారి అందరికీ ఆర్థికసాయం అందే అవకాశముందని విశ్లేషిస్తున్నారు.

వివరాలు 

రాష్ట్రంలో ఎన్ని ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీక్యాబ్‌లు ఉన్నాయి

ఈ మేరకు, ముఖ్యమంత్రి ప్రకటన ఆధారంగా రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం సచివాలయంలో కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, అదనపు కమిషనర్ రమాశ్రీ సహా ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీక్యాబ్‌లు, వాటి యజమానుల్లో ఎంత మంది డ్రైవింగ్ ద్వారా ఉపాధి పొందుతున్నారో తదితర వివరాలను సేకరించారు. అధికారుల ప్రకారం, ప్రభుత్వం త్వరలో ఈ పథకం అమలు చేసే స్పష్టమైన మార్గదర్శకాలను ప్రకటించి లబ్ధిదారుల ఖచ్చిత సంఖ్యను తెలియజేయనుంది.