
Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం.. రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో,అధికారులు మరో గేటును ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మొత్తం రెండు గేట్ల ద్వారా సాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్కు నీటి విడుదల సాగుతోంది. జూరాల,సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి ప్రస్తుతం 1,27,392 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరుతోంది. అదే సమయంలో,శ్రీశైలం నుంచి ఔట్ఫ్లో పరిమాణం 1,40,009 క్యూసెక్కులుగా ఉంది. ఈ మొత్తంలో,రెండు స్పిల్వే గేట్ల ద్వారా 53,764 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
వివరాలు
శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం 882.40 అడుగులకు..
ఇతర విడుదలల విషయానికి వస్తే, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 20,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు వద్ద ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,930 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటిమట్టం విషయానికి వస్తే, శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం ఇది 882.40 అడుగులకు చేరుకుంది. అలాగే, ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో 201.12 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది.