BJP-Manifesto :14 అంశాలతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో... విడుదల చేసిన మోదీ, నడ్డా, అమిత్ షా
భారతీయ జనతా పార్టీ (BJP)2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో (Manifesto) ను ప్రకటించింది. ఢిల్లీలో ఆదివారం 14 అంశాలతో కూడిన మేనిఫెస్టోను సంకల్ప పత్ర్ పేరుతో ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ లు ఆవిష్కరించారు. విశ్వబంధు, సురక్షిత భారత్, సంవృద్ధి భారత్, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్, స్వచ్ఛభారత్, గ్లోబల్ మ్యానిఫ్యాక్చరింగ్ హబ్, క్రీడా వికాసం, అత్యుత్తమ శిక్షణ, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, సంతులిత అభివృద్ధి, సుపరిపాలన, సాంస్కృతిక వికాసం, ఈజ్ ఆఫ్ లివింగ్ అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో కీలకాంశాలుగా ఉన్నాయి. సంకల్ప్ పత్ర్ లో 2025 ఏడాదిని జన్ జాతీయ గౌరవ్ గా పేర్కొంది.
70 ఏళ్లు పూర్తయిన వారికి ఉచిత వైద్యం
మేనిఫెస్టో సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ...పదేళ్ల కాలంలో దేశాభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామన్నారు. యువత, పేద, మహిళ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేశామని తెలిపారు. ఉత్తమ మేనిఫెస్టో తయారు చేసిన రాజ్ నాథ్ సింగ్ కు ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. 70 ఏళ్లు పూర్తయిన వారికి ఉచిత వైద్యం, ముద్రా రుణాలు రూ.20 లక్షలకు పెంపు, వచ్చే ఐదేళ్లపాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ కల్పిస్తామన్నారు. మహిళలను, రైతులను లక్షాధికారులు గా చేయడమే లక్ష్యంగా పరిపాలిస్తామన్నారు. తమిళ భాషకు విశ్వవ్యాప్తిని కల్పిస్తామని హామీనిచ్చారు.