LOADING...
Andhra Pradesh: కొత్త రంగు అద్దుకున్న కారం.. రాష్ట్రంలో సాగవుతున్న ఉత్తరాఖండ్‌ రకం
కొత్త రంగు అద్దుకున్న కారం.. రాష్ట్రంలో సాగవుతున్న ఉత్తరాఖండ్‌ రకం

Andhra Pradesh: కొత్త రంగు అద్దుకున్న కారం.. రాష్ట్రంలో సాగవుతున్న ఉత్తరాఖండ్‌ రకం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2026
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

కారం అంటే ఎర్రగా, మండే ఘాటుతోనే ఉంటుందన్నది మనకు అలవాటైన భావన. కానీ పసుపు రంగులోనూ కారం ఉంటుందంటే ఆశ్చర్యమే. ఉత్తర భారతదేశంలో పండించే ఈ ప్రత్యేక మిరప రకాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోనూ సాగవుతున్నాయి. మార్కెట్లో ఒక దశలో క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.42 వేల వరకు ధర పలికిన ఈ మిరపకు, ఇటీవల డిమాండ్‌ తగ్గడంతో రూ.35 వేలలోపే లభిస్తోంది. ఇదిలా ఉండగా, బ్యాడిగ (బైదగి) రకం మిరప మాత్రం క్వింటాల్‌కు రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు ధర దక్కించుకుంటోంది.

వివరాలు 

దేశంలో భౌగోళిక గుర్తింపు పొందిన మిరప రకాలు

దేశంలో భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్‌) పొందిన మిరప రకాలూ ఎన్నో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు సన్నం,గోవాలో ఖోలా,హర్మాల్‌, కర్ణాటకలో బైదగి, కేరళలో ఎడయూర్‌ ములకు, మహారాష్ట్రలో భివాపూర్‌, మిజోరాంలో మిజో, తమిళనాడులో రామంతపురం ముండు, తెలంగాణలో వరంగల్‌ చపాటా మిరపలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఎర్రటి రంగు ఎక్కువగా, ఘాటు తక్కువగా, కాస్త తీపిగా ఉండే మిరపే బ్యాడిగ. నక్షత్ర హోటళ్లలో వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలు ఎర్రగా కనిపించినా కారం తక్కువగా ఉండటానికి కారణం ఇదే. అధిక రంగు, తక్కువ ఘాటు దీని ప్రధాన లక్షణం. కర్ణాటకలోని బ్యాడిగ ప్రాంతంలో ఈ మిరప సాగు ఎక్కువగా ఉండటంతో అదే పేరుగా మారింది.

వివరాలు 

రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న బైదగి మిరప

పచ్చళ్ల తయారీలోనూ రంగు కోసం ఈ కారాన్ని వినియోగిస్తారు. ఎక్కువ ఘాటు ఉన్న మిరపలతో కలిపి బ్యాడిగ కారాన్ని వాడుతారు. ఆహార రంగంలోనే కాదు, గోళ్ల రంగులు, లిప్‌స్టిక్‌లు, నౌకల రంగుల తయారీలోనూ దీనికి మంచి వినియోగం ఉంది. కర్ణాటకలో ఈ రకం మిరప సాగు విస్తృతంగా ఉంది. హవేరీ జిల్లాలోని బైదగి ప్రాంతం పేరుతోనే ఈ మిరప రకం ప్రసిద్ధి చెందింది. దాదాపు రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఈ మిరపకు కడ్డీ, డబ్బీ బ్యాడిగ రకాలున్నాయి. దావణగెరె అనే మరో రకమూ ఉంది. ఎకరాకు సాధారణంగా 2 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

Advertisement

వివరాలు 

పచ్చళ్ల తయారీలో కశ్మీరీ కారం వినియోగం

మార్కెట్లో క్వింటాల్‌కు రూ.80 వేలకుపైగా ధర పలుకుతోంది. ఇటీవల వచ్చిన హైబ్రిడ్‌ రకాలు ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తున్నా, నాటు రకాలతో పోలిస్తే ధర మాత్రం తక్కువగానే ఉంటుంది. ఈ మిరప రకాల సాగు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోనూ జరుగుతోంది. ఇటీవలి కాలంలో పచ్చళ్ల తయారీలో కశ్మీరీ కారం వినియోగం పెరిగింది. దీనిలో ఘాటు తక్కువగా ఉండి, రంగు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ కారం ఉన్న సన్న రకాలతో కలిపి వాడుతున్నారు.

Advertisement

వివరాలు 

మిరపతో చేసే కారం చాట్‌, చానా మసాలా, పెరుగు ఆవడలో వాడే లఖోరి మిర్చి

పసుపు పచ్చ రంగులో కనిపించే అరుదైన మిరపను 'లఖోరి మిర్చి'గా పిలుస్తారు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా లఖోరా గ్రామం నుంచి వచ్చిన ఈ మిరపతో చేసే కారం చాట్‌, చానా మసాలా, పెరుగు ఆవడ వంటి పదార్థాల్లో విస్తృతంగా వాడుతారు. మొఘలాయ్‌ వంటకాల్లోనూ దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తర భారతదేశంలో ఈ కారానికి మంచి ఆదరణ ఉంది. కిలో ధర రూ.700 నుంచి రూ.1,000 వరకు ఉంటుంది. ఉత్తరాఖండ్‌లో సాగు ఎక్కువగా ఉన్నా,ఈ సీజన్‌లో అక్కడ పంట దెబ్బతినడంతో ఏపీ, తెలంగాణల్లో సాగు చేస్తున్న లఖోరి మిరపకు డిమాండ్‌ పెరిగింది.

వివరాలు 

రంగు, ఘాటు, రుచిని బట్టి ఎన్నో రకాల మిరపలు

అయితే వినియోగం పరిమితంగానే ఉండటంతో, ఈ ఏడాది ధరలు చూసి వచ్చే ఏడాది సాగు విస్తరిస్తే రైతులకు ఆశించిన ధరలు దక్కకపోవచ్చని వ్యాపార వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మొత్తంగా చూస్తే కారం ఒక్క రకమే కాదు.. రంగు, ఘాటు, రుచిని బట్టి ఎన్నో రకాల మిరపలు దేశవ్యాప్తంగా వినియోగంలో ఉన్నాయి. వాటి ప్రత్యేకతను బట్టి వంటల్లో, పచ్చళ్లలో, ఇతర పరిశ్రమల్లో ఉపయోగం మారుతూ వస్తోంది. బ్యాడిగ మిరప అయితే ముదురు ఎరుపు రంగుకు ప్రతీకగా నిలుస్తోంది.

Advertisement