Ganga Expressway: మీరట్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు గంగా ఎక్స్ప్రెస్వే.. రూట్ నుంచి స్పీడ్ లిమిట్ వరకు పూర్తి వివరాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ప్రతిష్టాత్మక గంగా ఎక్స్ప్రెస్వేను ప్రారంభించారు. 594 కిలోమీటర్ల పొడవుతో నిర్మితమైన ఈ ఎక్స్ప్రెస్వే ఉత్తరప్రదేశ్లోనే అత్యంత పొడవైనదిగా నిలిచింది. రూ.36,320 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ దేశంలోని అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ రహదారి ప్రాజెక్టుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
వివరాలు
గంగా ఎక్స్ప్రెస్వే ప్రత్యేకతలు
ఆరు లేన్లతో నిర్మించిన ఈ యాక్సెస్-కంట్రోల్ హైవేను భవిష్యత్తులో ఎనిమిది లేన్లకు విస్తరించే అవకాశముంది. గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు అనుమతి ఉంది. వేగ పరిమితి అమలు కోసం హైడెఫినిషన్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు భద్రత కోసం నిర్ణీత వేగ పరిమితులను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
వివరాలు
బైకులకు అనుమతి లేదు
ఈ ఎక్స్ప్రెస్వేపై రెండు చక్రాల వాహనాలకు పూర్తిగా నిషేధం విధించారు. 24 గంటల పర్యవేక్షణతో ఈ హైవేను నియంత్రిస్తూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. మార్గం, జిల్లాలు, ప్రయాణ సమయం మీరట్ నుంచి ప్రయోగరాజ్ వరకు విస్తరించిన ఈ ఎక్స్ప్రెస్వే మొత్తం 12 జిల్లాల మీదుగా ప్రయాణిస్తుంది. వాటిలో మీరట్, హాపూర్, బులంద్షహర్, అమ్రోహా, సంభల్, బుదౌన్, షాజహాన్పూర్, హార్డోయి, ఉన్నావ్, రాయ్బరేలీ, ప్రతాప్గఢ్, ప్రయాగ్రాజ్ ఉన్నాయి. ఈ మార్గం ద్వారా పశ్చిమ ఉత్తరప్రదేశ్ పరిశ్రమల ప్రాంతాలు తూర్పు వ్యవసాయ ప్రాంతాలతో అనుసంధానం అవుతాయి. దీంతో అభివృద్ధి సమతుల్యం అవుతుంది. ప్రస్తుతం 10-12 గంటలు పట్టే ప్రయాణం, ఈ ఎక్స్ప్రెస్వే వల్ల 6-8 గంటలకు తగ్గనుంది.
వివరాలు
టోల్ ప్లాజాలు
ఈ హైవేపై రెండు ప్రధాన టోల్ ప్లాజాలు ఏర్పాటు చేశారు. ఒకటి మీరట్ సమీపంలోని బిజౌలి గ్రామం వద్ద, మరొకటి ప్రయాగ్రాజ్లోని సోరావ్ తహసీల్ పరిధిలోని జుదాపూర్ దండూ గ్రామం వద్ద ఉంది. చివరి టోల్ ప్లాజాను 16 లేన్లతో నిర్మించి వాహన రాకపోకలను సులభతరం చేశారు. కీలక సదుపాయాలు గంగా ఎక్స్ప్రెస్వేను మల్టీ పర్పస్ కారిడార్గా రూపకల్పన చేశారు. తయారీ పరిశ్రమలు, లాజిస్టిక్స్ పార్కులు, గిడ్డంగులు, అగ్రో ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి అనువుగా రూపొందించారు. ముఖ్యంగా Shahjahanpur వద్ద 3.5 కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేయడం ప్రత్యేకత. ఇది అత్యవసర పరిస్థితుల్లో యుద్ధవిమానాల ల్యాండింగ్కు ఉపయోగపడుతుంది.
వివరాలు
ఆర్థిక ప్రభావం
అలాగే యమునా ఎక్స్ప్రెస్వే, ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వే, జేవర్ లింక్, నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ప్రతిపాదిత హరిద్వార్ మార్గాలతో అనుసంధానం కల్పించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉత్తరప్రదేశ్లో భారీ ఆర్థికాభివృద్ధికి మార్గం సుగమం కానుంది. ఎక్స్ప్రెస్వే వెంట 6,507 ఎకరాల్లో 12సమగ్ర తయారీ, లాజిస్టిక్స్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే రూ.47,000 కోట్ల విలువైన 987పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా మీరట్, ప్రయాగ్రాజ్, ఘాజియాబాద్ ప్రాంతాల్లో భూముల విలువ 20-50శాతం వరకు పెరగొచ్చని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ను తూర్పు ప్రాంతాలతో కలిపే ఈ గంగా ఎక్స్ప్రెస్వే, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెంచడంతో రాష్ట్ర అభివృద్ధిని కొత్త దిశలో తీసుకెళ్లే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.